ప్రపంచవ్యాప్తంగా ఏటా వర్షాకాలం సీజన్లో అనేక మంది డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి విష జ్వరాల బారిన పడుతున్నారు. అలాగే కొన్ని దేశాల్లో జికా, చికున్గున్యా, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధులు కూడా వస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. దోమలు.. ముఖ్యంగా ఏడిస్ ఏజిప్టి అనే దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధులు వస్తాయి. అయితే ఆ దోమలను నివారించేందుకు గాను అమెరికా పెద్ద ఎత్తున ప్రయోగం చేయనుంది. అందుకు గాను ఫ్లోరిడాలో జన్యు పరంగా వృద్ధి చేసిన 75 కోట్ల దోమలను వదలనున్నారు.
బ్రిటన్కు చెందిన అమెరికాలో కార్యకలాపాలు నిర్వహించే ఆక్సిటెక్ కంపెనీ ల్యాబ్లలో పెద్ద ఎత్తున దోమలను పెంచింది. అవన్నీ జన్యుపరంగా మార్పులు చేయబడిన దోమలు. సుమారుగా 75 కోట్ల వరకు దోమలను వారు ఉత్పత్తి చేశారు. వాటిని త్వరలో ఫ్లోరిడాలోని ఫ్లోరిడా కీస్ ద్వీపాల్లో వదలనున్నారు. ఆ దోమలన్నీ మగవే. అవి అక్కడి ఆడ ఏడిస్ దోమలతో సంయోగంలో పాల్గొంటాయి. దీంతో ఆడ ఏడిస్ దోమలు కొంత నిర్దిష్టమైన కాలవ్యవధిలో చనిపోతాయి. ఇలా వాటి వృద్ధిని అరికట్టవచ్చు.
అయితే మనల్ని కుట్టేవి ఆడ ఏడిస్ దోమలే. అవి తమ గుడ్లను పెంచేందుకు మనుషుల రక్తాన్ని తాగుతాయి. కానీ మగ ఏడిస్ దోమలు పువ్వుల్లోని మకరందాన్ని సేవిస్తాయి. అందువల్ల మగ దోమలతో మనకు ప్రమాదం లేదు. ఆడ దోమల వల్లే ప్రమాదం కలుగుతుంది. కనుకనే వారు మగ దోమలను ఉత్పత్తి చేసి వాతావరణంలోకి వదులుతారు. అయితే ఈ ప్రయోగానికి అమెరికా తాజాగా అంగీకారం తెలిపింది. అందువల్ల త్వరలోనే దోమలను ఫ్లోరిడాలో వదలనున్నారు. కాగా గతంలోనూ 2016లో బ్రెజిల్లో ఇలాంటి ప్రయోగమే చేశారు. దాంతో అప్పటి నుంచి అక్కడ విష జ్వరాలను కలిగించే దోమల సంఖ్య భారీ తగ్గింది. తద్వారా ఆయా వ్యాధుల బారిన పడే వారి సంఖ్య కూడా అక్కడ తగ్గుతోంది. అందుకనే అమెరికాలో ఈ ప్రయోగం చేపడుతున్నారు.