కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడ్డ సంగతి తెలిసిందే. దాదాపు 6 నెలలుగా థియోటర్స్ లో సినిమాల సందడి లేదు. ప్రేక్షకులకి వినోదం కరువైంది. రిలీజ్ కావాల్సిన సినిమాలు తప్పని పరిస్థితుల్లో ఓటీటీ అంటూ అందరూ మొబైల్స్ పట్టుకున్నారు. అందులో సినిమా చూసి ఆనందిస్తున్నారు. కోవిడ్ విస్తరిస్తున్నప్పటికి నెమ్మదిగా కేంద్రం ఆన్ లాక్ ప్రక్రియను వేగవంతం చేసింది. కీలక రంగాలని మళ్లీ యాక్టీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో కేంద్ర మార్గదర్శకాలని అనుసరించి సినిమా షూటింగ్ లు కూడా చేసుకోవచ్చని ప్రకటించడంతో ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ చిత్రాలను సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలోనూ షూటింగ్ సందడి మొదలైంది. అయితే కొంత షూటింగ్ జరిగిన తరువాత రెండు టీమ్ లకు కరోనా సోకడంతో తాత్కాలికంగా చిత్రీకరణ నిలిపివేశారు. మెగా డాటర్ సుష్మిత కొణిదెల నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ‘షూట్ ఔట్ ఎట్ ఆలేర్’. సుష్మిత తన భర్తతో కలిసి నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ కి ‘ ఓయ్ ‘ ఫేమ్ ఆనంద్ రంగ దర్శకత్వం వహిస్తున్నారు. జీ5లో ఈ వెబ్ సిరీస్ ని రిలీజ్ చేయబోతున్నారు. కో-డైరెక్టర్ కి కరోనా సోకడంతో షూటింగ్ ని నిలిపివేశారు. అలాగే అడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘మేజర్’ టీమ్ కూడా యూనిట్ లో ఒకరికి కరోనా సోకడంతో షూటింగ్ ఆపేశారు.
దీంతో స్టార్ హీరోలు తమ చిత్రాలతో సెట్స్ మీదకి వచ్చేద్నుకు వెనక్కి తగ్గారు. కాని కింగ్ నాగార్జున మాత్రం వైల్డ్ డాగ్ షూటింగ్ తో పాటు బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 షూటింగ్ లో పాల్గొనడం చూసి అందరు షాకయ్యారు. ఇక క్రిష్, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో తాజా చిత్రాన్ని రీసెంట్ గా ప్రారంభించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. వికారాబాద్ లో షూటింగ్ జరుపుతున్నారు. అంతేకాదు సంపత్ నంది సమర్పణలో రూపొందుతున్న ‘బ్లాక్ రోజ్’ వెబ్ సిరీస్ కూడా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కీలక పాత్రలో నటిస్తోంది.
ఇలా ఒక్కొక్కటిగా కరోనా నిభంధనలు పాటిస్తూ తెలుగు చిత్రాలు సెట్స్ మీదకి వస్తున్నాయి. కరోనా కి భయపడతునే పనులు ప్రారంభం అవుతున్నాయి. ఇక ఎటొచ్చి ఓపెన్ కావాల్సింది థియోటర్స్ మారమే. తెలుగు ఇండస్ట్రీ విందు భోజనం లాంటి సినిమాలను సిద్దం చేస్తుంది. వడ్డించడానికి విస్తరి కావాలన్నట్టు థియోటర్సే తెరుచుకోవాలి.