ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ ప్రచారం జరిగి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరి కొద్దిసేపటిలో ప్రారంభం కానున్నది. ఈ నెల 1వ తేదీన 149 డివిజన్లలో, నిన్న ఒక డివిజన్లో పోలింగ్ ప్రక్రియ పూర్తి కాగా, నేడు ఓట్ల లెక్కింపుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 150 డివిజన్ల ఓట్ల లెక్కింపునకు 30 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. కొన్ని డివిజన్లలో ఎన్నికల ఫలితం ఒక్క రౌండ్లోనే వెల్లడి కానున్నది. చాలా డివిజన్లలో పోలింగ్ శాతం భారీగా తగ్గడంతో రెండు రౌండ్లలోనే పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పెద్ద డివిజన్లలో గరిష్టంగా మూడు రౌండ్లు పట్టే అవకాశం ఉంది. ప్రతి డివిజన్కు ఒక కౌంటింగ్ హాలులో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు.
ఉదయం 8 గంటలకు బ్యాలెట్ బాక్స్లను తెరుస్తారు. 11గంటల తరువాత తొలి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఇప్పటి వరకూ 1,926 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. కౌంటింగ్ సమయానికి వచ్చే వాటిని పరిగణలోకి తీసుకుంటారు. అనంతరం బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. కరోనా నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మొత్తం గ్రేటర్ లో 74,67,256 ఓట్లకు గానూ 34,50,,331 ఓట్లు పోల్ అయ్యాయి. అత్యల్పంగా 11,818 ఓట్లు పోలైన మొహిదీపట్నం డివిజన్ ఎన్నికల ఫలితం ముందుగా వెల్లడి అవుతుందని భావిస్తున్నారు.