జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఆశించినంత నమోదు కాకపోవడంతో రాజకీయ పార్టీలు ఖంగుతిన్నాయి. ఓటు వేసేందుకు ఓటర్లు ఎందుకు ఉత్సాహం చూపలేదని, ఎక్కడ సమస్య వచ్చిందని పోలింగ్ అనంతరం పోస్టుమార్టం మొదలెట్టాయి. అయితే ఓటింగ్ శాతం ఎంత అయినప్పటికీ తమకే లాభం అని ప్రధాన పోటీదారులైన టీఆర్ఎస్ లీడర్లు,బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు. చెప్పుకోదగ్గ సీట్లు గెలుస్తామని కాంగ్రెస్, ఉన్న సీట్లను నిలబెట్టుకుంటామని ఎంఐఎం ధీమాగా ఉన్నాయిఅధికార టీఆర్ఎస్ వాదన ఏమిటంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులే ఓటింగ్కు వచ్చారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.
ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులు ఓటింగ్లో పాల్గొన్నారని, తక్కువ ఓటింగ్ నమోదైనా తమకు కలిసి వస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డబుల్ ఇండ్ల లబ్ధిదారులను గుర్తించామని, వారంతా పోలింగ్ కు వచ్చారని చెప్తున్నారు. అయితే.. గ్రేటర్ పరిధిలో ప్రతి నెల 10 లక్షలు మంది ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారు.వీరంతా ఓటింగ్కు రాలేదని టీఆర్ఎస్ పెద్దలు లోలోన మదన పడుతున్నారు. ఫ్రీ వాటర్ స్కీమ్, పన్ను రాయితీ ప్రకటన వర్కవుట్ అయిందా? ఒకవేళ ప్రజలు ఆ హామీలకు ఆకర్షితులైతే పెద్ద ఎత్తున పోలింగ్లో ఎందుకు పాల్గొనలేదని కూడా గులాబీ నేతలు చర్చించుకుంటున్నారు. అనుకున్నంతగా లబ్ధిదారులు ఓటింగ్లో పాల్గొనకపోయినా.. నమోదైన పోలింగులో పాల్గొన్నది లబ్ధిదారులేనని, అది కలిసి వస్తుందని టీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే వరద బాధితుల ఆగ్రహం తమ పార్టీకి కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నారు .
నెలన్నర కింద వచ్చిన వరదలతో హైదరాబాద్లోని బస్తీలు చాలా వరకు నీట మునిగాయి. ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోలేదన్న ఆగ్రహం బస్తీవాసుల్లో ఉంది. అయితే.. వరద సాయం ఈ ఎన్నికల్లో తమకు ప్లస్ అవుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది. కానీ, వరద సాయం విషయంలో తలెత్తిన వివాదాలు, టీఆర్ఎస్ లీడర్లే పంచుకు తిన్నారన్న ఆరోపణలు ఎలక్షన్లలో ప్రభావం చూపుతాయని బీజేపీ లీడర్లు అంచనా వేస్తున్నారు.ప్రచారంలో కూడా టీఆర్ఎస్ లీడర్లను బస్తీల్లోని వరద బాధితులు నిలదీసిన సంఘటనలు వారు గుర్తుచేస్తున్నారు. ఇదే బీజేపీకి కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ తగ్గుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొదట్నించి ప్లాన్ వేసిందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు ఇవ్వడంతో చాలా మంది ఓటర్లను ఊర్లకు వెళ్లేలా చేశారని వారు అంటున్నారు. అయితే ప్రభుత్వ విధానాలపై విసిగిపోయిన ప్రజలు పోలింగ్లో పాల్గొన్నారని, ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ తమకు అనుకూలమని బీజేపీ లీడర్లు అంచనా వేస్తున్నారు.తమ పార్టీ పరిస్థితి మెరుగైందని కాంగ్రెస్ చెబుతుండగా పాత సీట్లన్నింటినీ నిలబెట్టుకుంటామని మజ్లిస్ ప్రకటిస్తోంది.ఈ లెక్కలన్నీ తేలడానికి ఇంకోరోజు వేచి చూడాలి.