GHMC: జంటనగరాల్లోని శ్మశాన వాటికల వద్ద జరుగుతున్న దోపిడీకి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అడ్డుకట్ట వేసింది.ఈ శ్మశానవాటికల్లో వసూలు చేయాల్సిన నిర్ణీత మొత్తాలను జీహెచ్ఎంసీ నిర్ణయించింది.ఇంతే వసూలు చేయాలంటూ కూడా శ్మశానవాటికల వద్ద రేట్ల పట్టికలను సైతం అంటించింది.ఇది నిజంగా జంటనగరాల ప్రజలకు చాలా ఊరటనిచ్చే నిర్ణయమేనని చెప్పవచ్చు.
ఇప్పటివరకూ జరిగింది ఇది!
కరోనా తొలి వేవ్ సందర్భంగా గత ఏడాది మృతుల అంత్యక్రియలు బాధ్యతలను జీహెచ్ఎంసీ నిర్వహించింది.అయితే సెకండ్ వేవ్ లో మాత్రం జీహెచ్ఎంసీ ఈ విషయాన్ని పట్టించుకోలేదు.దీంతో శ్మశాన వాటికల వద్ద దోపిడీ మొదలైంది. కరోనా రోగుల మృతదేహాలకు అంత్యక్రియలకైతే అరలక్ష వసూలు చేస్తున్న శ్మశాన వాటికలు కూడా ఉన్నాయి. అంబులెన్సుల నిర్వాహకులే ఈ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసి కరోనా మృతుల కుటుంబసభ్యుల నుండి వేలల్లో డబ్బులు దండుకుంటున్నారు.ఆస్పత్రిలో చికిత్సకు అయ్యే వ్యయం ఒక ఎత్తైతే అంత్యక్రియలకు ఖర్చులు పెట్టాల్సిన మొత్తాన్ని చూసి కరోనా మృతుల కుటుంబసభ్యులు గుండెలు బాదుకుంటున్న పరిస్థితి జంటనగరాల్లో నెలకొంది.ఇదే విషయమై మీడియాలో సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తుండటంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది.మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ దీనిపై స్పందించారు.జీహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, జోనల్ అధికారులతో ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విషయాలు చర్చించి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేలా అంత్యక్రియల రేట్లను ఫిక్స్ చేశారు.
GHMC: ఇకపై వసూలుచేసే ఫిక్సెడ్ రేట్లు ఇవీ
ఇకపై ఏ స్మశానవాటికలో కూడా కరోనా వ్యాధితో మృతి చెందిన రోగుల మృతదేహాల అంత్యక్రియలకు ఎనిమిది వేల రూపాయల వరకు మించి వసూలు చేయరాదని అధికారులు నిర్ణయించారు.కరోనా కాకుండా ఇతర వ్యాధులతో మరణిస్తే వారి మృతదేహాల అంత్యక్రియల నిమిత్తం ఆరు వేల రూపాయలు మాత్రమే వసూలు చేయాలి.కరోనా మృతదేహాలను ఎలక్ట్రికల్ యంత్రంలో దగ్ధం చేసేందుకు నాలుగు వేల రూపాయలు మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది.కరోనా రోగి మృతదేహాన్ని ఎలక్ట్రికల్ మిషన్పై దహనం చేస్తే అందుకు నాలుగువేల రూపాయలు మాత్రమే తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు జంట నగరాల్లోని అన్ని శ్మశాన వాటికలలో సోమవారం నుండి ఇవేరేట్లు అమల్లో ఉంటాయని ఏ ఒక్కరు వీటిని ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించడమే కాకుండా ప్రజలందరికీ ఈ సమాచారం తెలిసేలా అన్ని శ్మశానవాటికల్లో రేట్ల పట్టికలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇది ఎంతవరకు ఆచరణలో అమలు అవుతుందో చూడాలి!