హిందూపూర్, మార్చి 21: హిందూపూర్ పార్లమెంటరీ వైసిపి అభ్యర్థిత్వం తన భార్య సవితకు కేటాయించి బి ఫాం ఇవ్వాలని గోరంట్ల మాధవ్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిని కోరుతున్నారు.
పోలీస్ శాఖలో ఇన్స్పెక్టర్గా చేస్తూ స్వచ్చంద పదవీ విరమణ చేసిన గోరంట్ల మాధవ్ ఇటీవల వైసిపిలో చేరగా పార్టీ అధినేత జగన్ అతనికి హిందూపూర్ లోక్సభ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
గోరంట్ల మాధవ్ స్వచ్చంద పదవీ విరమణ దరఖాస్తును ప్రభుత్వం ఇంత వరకూ ఆమోదించలేదు. విధి నిర్వహణ సమయంలో శాఖాపరమైన చర్యలకు సంబంధించి అంశాలు పెండింగ్లో ఉన్నాయని కారణం చూపుతూ ఆ శాఖ ఉన్నతాధికారులు రిలీవ్ ఆర్డర్స్ ఇవ్వలేదు.
ఈ విషయంపై గోరంట్ల మాధవ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించగా ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినప్పటికీ కర్నూలు డిఐజి నాగేంద్రకుమార్ తనను రిలీవ్ చేయలేదని మాధవ్ శనివారం వైసిపి అధినేత జగన్మోహనరెడ్డికి వివరించారు.
నామినేషన్ దాఖలు గడువు ఒక్క రోజు (సోమవారం) మాత్రమే ఉండటంతో బిఫాం తన భార్య సవితకు కూడా అందజేయాలని కోరినట్లు తెలుస్తుంది.
మాధవ్ రిలీవ్ పిటిషన్ పెండింగ్లో ఉన్నసమయంలో నామినేషన్ దాఖలు చేసినా ఎన్నికల సంఘం తిరస్కరించే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయంగా ఈ ఆలోచన చేస్తున్నారు.
పోలీస్ అధికారిగా ఉన్న సమయంలో మాధవ్ పోలీస్ అధికారుల సంఘం నేత హోదాలో మాజీ మంత్రి, ఎంపి జెసి దివాకరరెడ్డిపై మీసం మెలేసి సవాల్ విసిరిన విషయం విదితమే. ఈ కారణంగా మాధవ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాడు.
హిందూపూర్ లోక్సభ నియోజకవర్గంలో మాధవ్ సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉండటంతో పాటు పోలీస్ శాఖలో నిజాయితీగా బాధ్యతలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాడని వైసిపి అభ్యర్థిత్వం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.