ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పుల్వామా దాడి తర్వాత భారత్ విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో పాకిస్థాన్ క్రమంగా దిగివస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ.. శాంతి కోసం ఒక అవకాశం ఇవ్వాలని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరారు. పుల్వామా ఉగ్రదాడికి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదివారం ఆయన హామీ ఇచ్చారు. ఇందుకు సమాచారం ఇచ్చుపుచ్చుకోవడంలో భారత సహకారం అవసరమన్నారు.
తాను పాకిస్థాన్ ప్రధానమంత్రిగా బాధ్యతల చేపట్టిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తనకు అభినందనలు తెలిపారని.. ఆ సందర్భంగా ఆయన చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు ఇమ్రాన్ ఖాన్. పేదరికం, నిరక్షరాస్యతపై కలిసి పోరాడదామని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారని చెప్పారు. ‘నేను ఓ పఠాన్ కుమారుడిని. పఠాన్లు ఏది మాట్లాడితే అదే చేస్తారు’ అని తాను మోదీకి చెప్పినట్లు ఇమ్రాన్ తెలిపారు.
పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆదివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదలైందని న్యూస్ ఏజెన్సీ పీటీఐ పేర్కొంది. ఉగ్రదాడికి సంబంధించిన సమాచారం తమకు ఇస్తే.. బాధ్యులైన వారిని శిక్షిస్తామని.. ‘శాంతి కోసం ఒక్క అవకాశం’ ఇవ్వాలని ప్రధాని మోదీని ఇమ్రాన్ ఖాన్ ఆ ప్రకటనలో కోరారు.
అయితే, దాడికి సంబంధించిన ఆధారాలిస్తేనే దర్యాప్తు చేస్తామన్న పాక్ ప్రధాని ఆఫర్పై భారత్ స్పందించింది. కొత్తగా ఆధారాలంటూ పాక్ కుంటిసాకులు వెతుకుతోందని మండిపడింది. ‘జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ, దాని నాయకుడు మసూద్ అజార్ పాకిస్థాన్లోనే ఉన్నాడనేది జగమెరిగిన సత్యం. పాకిస్థాన్ చర్యలు చేపట్టాలనుకుంటే ఈ రుజువు చాలాదా?’ అని భారత విదేశీ మంత్రిత్వ శాఖ నిలదీసింది.
‘ముంబైలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి 26/11కి సంబంధించిన ఆధారాలను ఇచ్చాం. కానీ, ఆ కేసులో పాకిస్థాన్ పదేళ్లుగా ఎలాంటి పురోగతి సాధించలేదు. అలాగే పఠాన్కోట్ ఎయిర్బేస్పై జరిగిన దాడి విషయంలోనూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దర్యాప్తు చేస్తామంటున్న పాకిస్థాన్.. ఈ కేసుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు’ అని భారత విదేశాంగ శాఖ మండిపడింది.
ఇది ఇలా ఉండగా, రాజస్థాన్లో నిర్వహించిన ఓ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ప్రపంచమంతా ఉగ్రవాద నిర్మూలనకు ఒక్కటవుతోంది. ఉగ్రవాదులను, వారికి తోడ్పాటునందిస్తున్న వారు శిక్షను అనుభవించకతప్పదు. ఇది మారిన భారత్. బాధ పడుతూ కూడా మౌనంగా కూర్చోం. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో ఎలా అణిచివేయాలో మాకు తెలుసు’ అని స్పష్టం చేశారు.