దేవుళ్లకు గుడి కడతాం .. ఇంకాస్త పైత్యం ఎక్కువైతే నాయకులకు , సినిమాతారలకు కడతాం .. ఈ మధ్యనే తెల్ల ఎలుకలకు గుడి కట్టిన విషయం తెలిసిందే .. ఇప్పుడు దేవుడు,మనుషులు,ఎలుకల నుండి బైకుల వరకు పాకింది.. ఇదే వరసలో ఇప్పుడు ఏకంగా బైక్ కి గుడి కట్టారు..! ఆశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం నిజం.. అయితే ఆ గుడికి “బుల్లెట్ బాబా” అని పేరు.. ఇంతకీ ఎక్కడో, ఏంటో మీకు తెలుసా..? అయితే దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.!
చాలామంది వాహనప్రియులు ఎక్కువగా ఇష్టపడే ద్విచక్ర వాహనాలలో రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి . మాములుగా రాయల్ ఎన్ఫీల్డ్ చూడటానికి చాలా లగ్జరీగా ఉంటుంది. అంతేకాకుండా ఒక హుందా రైడింగ్ ని ఇస్తుంది. మన దేశీయ మార్కెట్లో కూడా వీటి అమ్మకాలు యమా జోరుగా ఉన్నాయి. సాధారణంగా అందరికి రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఒక బైక్ అని మాత్రమే తెలుసు. కానీ మనదేశంలో అక్కడ ఏకంగా గుడి కట్టి పూజించేస్తున్నారు..రాజస్థాన్ రాష్ట్రంలో జోద్పూర్కు 47 కిమీల దూరంలో ఉన్న పాలి జాతీయ రహదారి పక్కన ఓం బన్నా అనే పేరుతో బుల్లెట్ బాబా గుడి ఉంది. ఎక్కడైనా ప్రజలు తమకు ఇష్టమైన దేవతలను వివిధ రకాల నమ్మకాలతో ఎంతో భక్తిగా పూజించడం మనం చూసాం, కానీ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కి అక్కడ గుడి కట్టి అనునిత్యం పూజలు చేస్తున్నారు.
ఓం బన్నా చరిత్ర :
ఎందుకు ఇలా చేస్తున్నారు, దీని వెనుక ఉన్న చరిత్ర పుటల్ని మనం తిరగేసినట్లైతే ? డిసెంబర్ 2, 1988 వ సంవత్సరం ఓం సింగ్ రాథోడ్ (ఓం బన్నా) తన రాయల్ ఎన్ ఫీల్డ్ 350 సీసీ బైక్ పై చోటిలా అనే ఊరికి బయల్దేరాడు. గ్రామానికి కొంత సమీపంలోనే బైక్ ఒక చెట్టుకు ఢీ కొనింది. దీంతో ఓం బన్నా పక్కనే ఉన్న ఒక గుంతలో పడిపోయాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని బుల్లెట్ను స్వాధీనం చేసుకుని ఆ బైక్ ను పోలీస్ స్టేషన్లో పెట్టారు. పోలీసులు బుల్లెట్ను పోలీస్ స్టేషన్ లో పెట్టిన తర్వాత మరుసటిరోజు ఆ బుల్లెట్ మాయమై ఓం సింగ్ రాథోడ్ ఎక్కడైతే మరణించాడో అక్కడే ఉంది. అయితే పోలీసులు ఎవరో ఆకతాయిలు కావాలని ఈ బైక్ ను తీసుకు వచ్చి ఇక్కడ పెట్టి ఉంటారు అనుకున్నారు. దాన్ని మళ్ళీ దానిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఈ సారి పోలీసులు బైక్ లోని పెట్రోల్ మొత్తం తీసేసారు. అయినప్పటికీ తర్వాత రోజు పోలీస్ స్టేషన్ లో మాయమై అదే ఘటనా స్థలంలో కనిపించింది. పోలీసులు ఎన్ని సార్లు ఈ బైక్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టినప్పటికీ అది మళ్లీ మళ్ళీ అదే స్థలానికి చేరుకునేది. దీంతో పోలీసులు ఆ బుల్లెట్ బైకుని అక్కడే వదిలేశారు.
అయితే స్థానికులు ఇదంతా ఓం బన్నా (ఓం సింగ్ రాథోడ్) ఆత్మ ఇలా చేస్తున్నాడని నమ్మారు. నమ్మడమే కాదు ఓం బన్నా దేవునితో సమానమని భావించి ఆ గుంత దగ్గరే గుడి కట్టి “బుల్లెట్ బాబా” అనే పేరు పెట్టారు. ఇంకా దానికి పూజలు చేయడం కూడా మొదలుపెట్టారు. మొదట్లో ఆ గుడికి స్థానికులు తప్పా ఇతరులు వచ్చేవారు కాదు. కానీ కాలక్రమంలో స్థానికులు ఓం బన్నా ఆత్మా తిరుగుతున్నాడని, పూజిస్తే కోరికలు తీరుస్తాడని గట్టిగా విశ్వసించారు. మెల్లమెల్లగా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ గుడికి రావడం మొదలుపెట్టారు. రోడ్డుపై వెళ్లే వారు ఈ గుడిని దర్శించి వెళ్తే ఎటువంటి ప్రమాదాలు జరగవని అక్కడివారు గట్టిగా నమ్మేశారు. బుల్లెట్ బాబా నిజంగా కోరికలు తీరుస్తాడా.. మీరు కూడా ఈ బుల్లెట్ బాబా దేవాలయాన్ని చూడాలనుకుంటున్నారా.. అయితే రాజస్థాన్ రాష్ట్రంలోని జోద్పూర్ దగ్గర ఉన్న చోటిలా గ్రామాన్ని ఒకసారి తప్పక చేసేయండి మరి.