GOA Elections: రాజకీయాల్లోనూ కొన్ని సెంటిమెంట్ లు ఉంటాయి. ఏపి (Andhra Pradesh)లో స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించిన అనేక మంది ఆ తరువాత ఎన్నికల్లో పరాజయం పాలవుతూ వచ్చారు. అదే విధంగా ఏపిలోని అనంతపురం (anantapur) జిల్లా ఉరవకొండ (uravakonda) నియోజకవర్గం గెలిచిన అభ్యర్ధి పార్టీ రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడం లేదు. 2004, 2009 ఎన్నికల్లో అక్కడ టీడీపీ అభ్యర్ధిగా పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. ఆ రెండు సార్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014 ఎన్నికల్లో అక్కడ వైసీపీ అభ్యర్ధి విశ్వేశ్వరరెడ్డి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి పయ్యావుల కేశవ్ గెలిచారు., రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇలా 2004 నుండి నాలుగు పర్యయాలు అక్కడ గెలిచిన అభ్యర్ధులు ప్రతిపక్షంలో ఉండటం ఆనవాయితీగా వస్తోంది. అలాంటి సెంటిమెంటే గోవాకు ఉంది. గోవాలో అధికారంలోకి వచ్చిన పార్టీనే ఢిల్లీలోనూ అధికారాన్ని హస్తగతం చేసుకుంటూ వస్తోంది. వచ్చే ఏడాది గోవా (GOA) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు గోవా రాష్ట్రంపై దృష్టి సారిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు బలంగా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల సహకారంతోనే అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయి. అయితే ఈ సారి పోటీ మాత్రం భిన్నంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
GOA Elections: ఇక్కడ అధికారంలోకి వస్తే ఢిల్లీ పీఠం దక్కినట్లే
గోవా సెంటిమెంట్ ఎలా అంటే..2007 అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఆ తరువాత 2009 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అదే విధంగా 2012 ఎన్నికల్లో గోవాలో కాంగ్రెస్ కూటమి పరాజయం పాలైంది. బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఆ తరువాత 2014 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్ డీ ఏ గెలిచి మోడీ ప్రధాన మంత్రి అయ్యారు. 2017లో జరిగిన గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ 13 స్థానాలు మాత్రమే కైవశం చేసుకున్న బీజేపీ మిత్రపక్షాలతో కలిసి గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవశం చేసుకోవడంతో రెండవ సారి మోడీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2007 నుండి ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో అధికారాన్ని కైవశం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. గడచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు అధికార బీజేపీలో చేరిపోయారు. దీంతో ఈ సారి కాంగ్రెస్ పార్టీ కొత్త అభ్యర్ధులను రంగంలోకి దింపుతోంది. బీజేపీ కూడా గోవాలో అధికారాన్ని కైవశం చేసుకునేందుకు సర్వశక్తులను ఒడ్డుతోంది. అయితే గోవాలో చిన్న చితకా పార్టీలు కీలకంగా మారుతున్నాయి.
గోవా ఎన్నికల గోదాలోకి మరో మూడు పార్టీలు
మహరాష్ట్ర వాదీ, గోమంతక్ పార్టీతో పాటు అనేక ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పొత్తుతో పోటీ చేస్తుంటాయి. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవాలో ఈ సారి మరో మూడు పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. అమ్ అద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన వంటి పార్టీలు కూడా ఇక్కడి ఎన్నికల గోదాలోకి అడుగు పెడుతున్నాయి. అయితే ఈ రాజకీయ పరిణామాలతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం వల్ల బీజేపీకి లాభం చేకూరుతుందని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. అమ్ ఆద్మీ పార్టీ ఇక్కడి ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇక్కడి ఎన్నికల్లోనూ సత్తా చాటి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ భావిస్తున్నారు. ఈ సారి కూడా గోవా సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి మరి.