పనాజి: గోవా డీజీపీ ప్రణబ్ నందా గుండెపోటుతో కన్నుమూశారు. అధికారిక పర్యటనపై ఢిల్లీ వెళ్లిన నందా శనివారం(నవంబర్ 16) తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారని ఐజీ జస్పాల్ సింగ్ తెలిపారు. నందా హఠాన్మరణం షాక్ కు గురి చేసిందని ఆయన అన్నారు.
1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రణబ్ నందా.. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల క్యాడర్ లో పనిచేశారు. ఈ ఏడాది మార్చ్ లో గోవా డీజీపీగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. ప్రణబ్ నందా భార్య సుందరి కూడా ఐపీఎస్ అధికారిణే. పుదుచ్చేరి డీజీపీగా ఆమె పని చేశారు. డీజీపీగా బాధ్యతలను స్వీకరించక ముందు దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఆమె సేవలందించారు.