సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం చవి చూసిన తరువాత రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారు అయిన విషయం తెలిసిందే. టీడీపీలో ఒక నాడు చక్రం తిప్పిన నాయకులే పార్టీని వీడి వేరే పార్టీలకు వెళ్లిపోవడంతో పార్టీ శ్రేణుల రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు అలుముకున్నాయి. సుజనా చౌదరి, సీఎం రమేష్ సహా నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడి బీజేపీలో చేరిపోవడం పార్టీకి సమీపంలో భవిష్యత్తు లేదనేది అర్థం అయిపోయింది. అనంతరం ఒక్కరొక్కరుగా నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు షాక్ ఇచ్చి వైసీపీకి జై కొట్టారు. వైసీపీ నుండి టీడీపీలో నాడు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆదినారాయణ రెడ్డి బీజేపీకి వెళ్లిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే పలువురు టీడీపీ గట్టి నాయకులే పార్టీ నుండి వెళ్లిపోయారు. మరి కొందరు సైలెంట్ అయిపోయారు. మరి కొందరు పక్క చూపులు చూస్తూ రేపో మాపో అన్నట్లుగా ఉంది.
అయితే ఈ పరిస్థితులన్నీ గమనించిన పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్న సంకల్పంతో వివిధ కమిటీలను పూర్తిగా ప్రక్షాళన చేశారు. ఈ క్రమంలో బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీలు, కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరోలలో మార్పులు, చేర్పులు చేశారు. తాజాగా 210 మందితో రాష్ట్ర కమిటీని ప్రకటించారు చంద్రబాబు. రాష్ట్ర కమిటీలో పదవులను ఆశించి దక్కని వారు, కమిటీలో స్థానం ఇచ్చినా సరైన ప్రాధాన్యత లేదని భావిస్తున్న నేతలు అసంతృప్తితో ఉన్నారుట.
ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ సందర్భంగా ఆ నేత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాజీనామా లేఖ రాస్తూ తీవ్రస్థాయిలో తన అసంతృప్తి కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 2002లో టీడీపీ తీర్థం పుచ్చుకుని 18 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న చెలికాని సొంబాబు నేడు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన 11 సంవత్సరాలుగా పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. పార్టీ నాయకుడిగానే కాక సొంబాబు కుటుంబ సభ్యులు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సోంబాబు పార్టీ వీడటం పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీకి గట్టి దెబ్బేనని అంటున్నారు. పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వడం లేదనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెలమ సామాజిక వర్గానికి చంద్రబాబు మొండి చేయి చూపారని సోంబాబు ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉంగుటూరు సీటు కేటాయించాలని కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి రాజీనామా చేసిన తాను తన కుటుంబ సభ్యులు స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్ల వ్యవహారాలు చూసుకుంటానని వెల్లడించారు. అయితే టీడీపీని వీడిన సోంబాబు వైసీపీ లోకి వెళతారా? బీజేపీలో చేరతారా? లేక రాజకీయాలకు దూరంగా ఉంటూ చారిటబుల్ ట్రస్ట్ వ్యవహారాలు చూసుకుంటారా ? అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి.