పోలీసులమంటూ కొందరు వ్యక్తులు ఒక బంగారం వ్యాపారిని మోసం చేశారు. కిలో బంగారు బిస్కెట్లతో దొంగలు తప్పించుకున్నారు. నిన్న రాత్రి ఒంగోలు ఆర్టీసీ బస్టాండులో ఈ సంఘటన జరిగింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఒక బంగారం వ్యాపారి ఆభరణాలు తయారీ కోసమై చెన్నై నుంచి కిలో బంగారు బిస్కెట్లు తీసుకుని వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
నెల్లూరు వరకు ఓ వాహనంలో వచ్చి అక్కడి నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సు ఎక్కాడు ఆ వ్యాపారి. ఒంగోలు బస్టాండులో కొందరు వ్యక్తులు బస్సు ఎక్కి తాము ఐడీ పార్టీ పోలీసులమని, తనిఖీ చేయాలని ఆ వ్యాపారిని బస్సులో నుంచి కిందికి దింపారు. ఆ తరువాత వ్యాపారి వద్ద ఉన్న బంగారు బిస్కెట్లను తీసుకుని పరారయ్యారు.
ఇది అంతా క్షణాలలో జరగడంతో వ్యాపారి షాక్ లో ఉండిపోయాడు. షాక్ నుంచి తేరుకున్న వ్యాపారి ఈ విషయాన్ని వెంటనే ఒంగోలు వర్తక సంఘం దృష్టికి తీసుకెళ్ళగా వారు పోలీసులను ఆశ్రయించారు. విషయం విన్న పోలీసులు తాము ఎవరి నుంచీ బంగారం స్వాధీనం చేసుకోలేదని చెప్పడంతో వర్తక సంఘం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?