భారతదేశంలో ఇప్పుడు అందరి చూపు కరోనా వ్యాక్సిన్పైనే పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని వివిధ వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను సందర్శించిన నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అనే ఉత్కంఠ , ఆసక్తి అందరిలో నెలకొంది.
ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం మిషన్ కోవిడ్ సురక్ష- ఇండియన్ కోవిడ్-19 వ్యాక్సిన్ డెవలప్మెంట్ మిషన్ కోసం రూ.900 కోట్లతో మూడవ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. వ్యాక్సిన్ల పరిశోధన, అభివృద్ధి కోసం బయోటెక్నాలజీ విభాగానికి (DBT) ఈ గ్రాంట్ అందించనున్నారు.
కరోనా వ్యాక్సిన్ కోసం …
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ (శాస్త్ర సాంకేతిక విజ్ఞాన) మంత్రిత్వశాఖ బయో టెక్నాలజీ విభాగం కార్యదర్శి, ఛైర్పర్సన్ బిరాక్ డాక్టర్ రేణుస్వరూప్ మీడియాతో మాట్లాడుతూ, కరోనా వ్యాక్సిన్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. మిషన్ కోవిడ్ సురక్ష మన దేశానికి స్వదేశీ, సరసమైన ధరలకు వ్యాక్సిన్ల అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. చికిత్స విధానం అభివృద్ధి కోసం కోవిడ్-19 వ్యాక్సిన్ డెవలప్మెంట్ మిషన్ వేగవంతమైన ఉత్పత్తికి అవసరమైన నిధుల వనరులను అందిస్తోంది. 5-6 వ్యాక్సిన్ అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని వివరించారు.
12 నెలలు … 900 కోట్లు…
ప్రీ క్లినికల్, క్లినికల్ డెవలప్మెంట్ను వేగవంతం చేయడం తో పాటు ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న లేదా క్లినికల్ దశలో అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉన్న కోవిడ్-19 వ్యాక్సిన్ క్యాండిడేట్ లైసెన్స్, క్లినికల్ ట్రయల్స్ సైట్లను ఏర్పాటు చేస్తోంది. కేంద్ర ప్రయోగశాలలు, అధ్యయనాలకు అనువైన సౌకర్యాలు, ఉత్పత్తి సౌకర్యాలు,ఇతర పరీక్ష సౌకర్యాలను బలోపేతం చేయడంలో భాగంగా కోవిడ్ సురక్ష మిషన్ మొదటి దశకు 12 నెలల కాలానికి రూ.900 కోట్లు కోటాయించనున్నారు.
విదేశీ టీకాలు సైతం….
ఇదిలాఉండగా, ఫైజర్, ఆక్స్ఫర్డ్ టీకాలు సత్ఫలితాలిస్తుండడంతో భారత్లోనూ ఆయా టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పుణెకు చెందిన సీరమ్ సంస్థ ఆక్స్ఫర్డ్ టీకాపై ఒప్పందాలు కుదుర్చుకుంది. 3, 4 నెలల్లో ఈ టీకా భారత్లో అందుబాటులోకి వచ్చే అవకాశముందని సీరమ్ సీఈవో అదర్ పూణావాలా వెల్లడించారు. ఫైజర్ వ్యాక్సిన్ విషయంలోనూ భారత్ చర్చలు జరుపుతోందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా అన్నారు. కొవిడ్ టీకాల ఉత్పత్తి రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, వర్చువల్ రియాల్టీ(వీఆర్) సాంకేతికతను వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.