దేశంలో ఇప్పుడు అందరి చూపు కోవిడ్ వ్యాక్సిన్ పైనే. ఏ సంస్థ రూపొందించే వ్యాక్సిన్ అయినప్పటికీ, ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత ధర ఉంటుందనే వివరాలు ఆరా తీయడంలో ప్రజలు ఉన్నారు. ఇలాంటి సమయంలో మన దేశానికి చెందిన ఓ సంస్థ కీలక ప్రకటన చేసింది. పూణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది.
వ్యాక్సిన్ ఎవరికి ముందు ఇస్తారంటే…
ఆక్స్ఫర్డ్ రూపొందించిన టీకాను స్వీడిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకాతో కలిసి పూణేకు చెందిన సీరం ఇస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ‘కోవిషీల్డ్’ పేరుతో వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తోంది. దీని గురించి హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్-2020లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూణావాలా కీలక వివరాలు వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఆక్స్ఫర్డ్ కొవిడ్-19 వ్యాక్సిన్ ఆరోగ్య సంరక్షణ కార్మికులు, వృద్ధులకు అందుబాటులోకి వస్తుందని, ఏప్రిల్ నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులోకి ఉంటుందని తెలిపారు. ప్రజలకు వ్యాక్సిన్ రెండు డోసులు రూ.1000కే అందుబాటులో ఉంటుందని చెప్పారు. కేవలం ఫ్రంట్లైన్ కార్మికులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులు, వృద్ధులకు పరిమిత ఉపయోగం కోసం మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. తుది పరీక్షల ఫలితాలు, నియంత్రణ అనుమతులపైనే వ్యాక్సిన్ లభ్యత ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.అత్యవసర వినియోగం కోసం ఎస్ఐఐ ఎప్పుడు దరఖాస్తు చేస్తుందనే ప్రశ్నకు స్పందిస్తూ యూకే, యూరోపియన్ మెడిసిన్స్ ఎవాల్యుయేషన్ ఏజెన్సీ (ఈఎంఈఏ) ఆమోదించిన వెంటనే దేశంలో పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు.
టీకా ఎలా పనిచేస్తుందో తెలుసా?
తమ వ్యాక్సిన్ టీ సెల్స్ ప్రతిస్పందననను ప్రేరేపించిందని అదర్ పూణావాల తెలిపారు. దీర్ఘకాలిక రోగ నిరోధక శక్తి, యాంటీబాడీ ప్రతి స్పందనకు సూచిక అనీ, అయితే టీకాలు దీర్ఘకాలికంగా రక్షిస్తాయో లేదో సమయం మాత్రమే చెబుతుందని, ప్రస్తుతం టీకాలకు ఎవరూ సమాధానం చెప్పలేరని పూనావాలా అన్నారు. వ్యాక్సిన్ సమర్థతపై మాట్లాడుతూ ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వృద్ధుల్లో బాగా పని చేస్తోందని రుజువు చేస్తోందన్నారు. వ్యాక్సిన్ పిల్లలకు వేసేందుకు మరికొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుందని, శుభవార్త ఏంటంటే పిల్లల్లో కొవిడ్-19 తీవ్రత లేదని చెప్పారు. మీజిల్స్ న్యుమోనియా మాదిరిగా కాకుండా వైరస్ ప్రాణాంతకమైందని, మహమ్మారి పిల్లల్లో రిస్క్ తక్కువగా ఉన్నట్లు అనిపిస్తోందని, అయితే వాహకాలుగా మాత్రం మారవచ్చని, ఇతరులకు ఇన్ఫెక్షన్ సోకవచ్చన్నారు.
మనందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే….
ప్రతి భారతీయుడికి టీకాలు వేయడానికి రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుందని అదర్ పూణావాల తెలిపారు. 2024 నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికీ టీకా వేయనున్నట్లు చెప్పారు. ఎందుకంటే సరఫరాలో అవరోధాలు, అవసరమైన బడ్జెట్, వ్యాక్సిన్, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల సంసిద్ధత అవసరమన్నారు. ఫిబ్రవరి నుంచి నెలకు సుమారు పది కోట్ల డోసులను తయారీ చేయాలని సీరం ఇస్టిట్యూట్ ఆఫ్ ఇండియా యోచిస్తోంది. ఇండియా తమ ప్రాధాన్యమని, ఈ సమయంలో సీరం ఇసిస్టిట్యూట్ ఇతర దేశాలతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోవడం లేదని పూనావాలా స్పష్టం చేశారు.