తెలంగాణలో ఇప్పుడు రాజకీయ పార్టీల గురించి మాట్లాడాలంటే ప్రధానంగా అధికార టీఆర్ఎస్ , ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతోన్న బీజేపీ గురించే అనుకోవచ్చు!.
దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం.. ఆ వెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా సీట్లు రావడంతో.. కాషాయం పార్టీ శిబిరంలో కొత్త ఉత్సాహం నిండింది. ఆ పార్టీపై అంచనాలు సైతం అలాగే పెరిగాయి. ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురుచూస్తుండగా రాష్ట్ర ప్రజలంతా ఇప్పుడు బీజేపీయే ప్రత్యామ్నాయం అని చూస్తున్నారనే టాక్ వస్తోంది.
బీజేపీలోకి వాళ్లంతా జంప్?
బీజేపీ ముఖ్య నేతలు తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. దీనికోసం ఆపరేషన్ ఆకర్ష్ను చేపట్టారు. పార్టీలోని కీలక నేతలను రంగంలోకి దింపి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో నిరుత్సాహంగా ఉన్నవాళ్లు.. యాక్టివ్ పాలిటిక్స్కు కాస్త దూరంగా ఉంటున్నవారిని ఎంచుకుని మరీ ఇంటికి వెళ్లి పలుకరిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. ఇప్పటికే పలువురు నేతలు.. బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. ఇప్పుడు మరో నేత కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైపోయింది.
ఆ నేత కండువా కప్పుకొన్నారు
తెలుగు రాజకీయాల్లో సీనియర్ నేత అయిన మాజీ మంత్రి డా.ఎ.చంద్రశేఖర్ బీజేపీలో చేరనున్నారు. ఇవాళ చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి పార్టీలోకి బీజేపీ నేత డీకే అరుణ ఆహ్వానించారు. దీంతో త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరేందుకు మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ సిద్ధమయ్యారు. కేంద్ర పార్టీ పెద్దల సమక్షంలో ఆపార్టీ కండువా కప్పుకోనున్నారు. గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన వికారాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి… బీజేపీలో చేరనున్నట్టు చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా సేవలు అందించిన చంద్రశేఖర్ ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు.. కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు.. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నా అంత యాక్టివ్గా లేరు.
నేనా… బీజేపీలో చేరడమా?
అయితే, మరో నేత బీజేపీలో చేరనున్నారనే ప్రచారానికి చెక్ పెట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బలమైన నాయకుల్లో ఒకరు, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇలా షాకిచ్చిన నాయకుడు. డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన మహేశ్వర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యల్ప ఓట్ల తేడాతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. పైగా అప్పట్లో రైతుల కోసం రాహుల్గాంధీ నిర్వహించిన పాదయాత్ర విజయవంతం చేసిన నాయకుడిగా కాంగ్రెస్లో మంచి పేరుంది. మహేశ్వర్ రెడ్డిపై కమలం కన్నేసిందని.. కాషాయ కండువా కప్పేందుకు, పార్టీ అగ్రనాయకులు సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం సాగింది.. ఇక, ఆయన కమలం పార్టీ గూటికి చేరడం ఖాయమనే ప్రచారం కూడా సాగింది. అయితే, ఇవాళ అనూహ్యంగా గాంధీ భవన్లో మహేశ్వర్రెడ్డి ప్రత్యక్షమయ్యారు. కొత్త పీసీసీ ఎంపికకై కసరత్తు చేస్తున్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ ఠాగూర్తో భేటీ అయ్యేందుకు వచ్చారు. అభిప్రాయ సేకరణలో తన అభిప్రాయాన్ని చెప్పేందుకు గాంధీ భవన్కు వచ్చారు. దీంతో.. కొందరు కాంగ్రెస్ నేతలు షాక్ తిన్నారట. ఇక, ఈ సందర్భంగా పార్టీ మార్పు వార్తలపై స్పందిస్తూ.. ఎవరు చెప్పారు? నేను పార్టీ మారుతానని ఎదురు ప్రశ్నించారు. అదంతా మీడియా సృష్టేనంటూ మహేశ్వర్ రెడ్డి కొట్టిపారేశారు.