ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు 7 వేలకు పైగా నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనలను పెంచుతున్నాయి. రాష్ట్రంలోని తూర్పు గోదావరి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనే 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక గ్రామాల్లో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రప్రభుత్వం ఇకపై పల్లెల్లో నివసించే వారు ఖచ్చితంగా మాస్కు ధరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. జగన్ సర్కార్ ఇప్పటికే ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను అమలు చేస్తుంది. కొన్ని చోట్ల అయితే సోమవారం నుండి శుక్రవారం వరకు కేవలం 11 గంటల వరకే షాపులను తెరవనిస్తున్నారు. ఆ తర్వాత లాక్ డౌన్ ను శనివారం మరియు ఆదివారం పూర్తిస్థాయిలో విధిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఆదివారం రోజున కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అన్న ఆదేశాలను ప్రజలు బేఖాతరు చేయడం మొదలుపెట్టారు.
ఇక ఇలా కరోనా కట్టడి విషయంలో పల్లెల్లో కూడా మాస్కు తప్పనిసరి అంటూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రావు కరోనా నివారణ చర్యల్లో భాగంగా పల్లెల్లోని ప్రజలందరూ మాస్క్ ధరించాలని మాస్కు ధరించి పక్షంలో పంచాయతీ స్థాయిని బట్టి పది రూపాయల నుండి 50 రూపాయల వరకు జరిమానా విధించాల్సి ఉంటుందని ప్రకటించి ఈ విధంగా కార్యాచరణ మొదలుపెట్టాలి అని అధికారులను ఆదేశించారు. మంత్రి పల్లెల్లోని ప్రజలు బయట తిరిగే సమయంలో మాస్కులు ధరిస్తున్నారో లేదో నిరంతరం ఒక కన్నేసి ఉంచి…. వారిని ఎల్లవేళలా పర్యవేక్షిస్తూ ఉండాలని కూడా అధికారులను ఆదేశించారు.
ఇక రాష్ట్రంలో కరోనా ఉధృతి భారీగా పెరిగిన నేపథ్యంలో.. జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏపీ ప్రజలకు బాగా మేలు చేకూర్చే విషయమే. ప్రతి రోజు రాష్ట్రంలో మరణాలు ఎక్కువ అవుతుండడంతో జగన్ ఈరకంగా అసలు వైరస్ ను ఎవరిని సోకనివ్వకుండా చేయడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.