ఏమాటకామాట చెప్పుకోవాలంటే… గత కొంతకాలంగా టీడీపీ శ్రేణులు సైలంటుగా ఉన్నాయి. ఒకపక్క కరోనా కాలం… అధినేతేమో హైదరబాద్ లో మకాం… ఆందోళనలకు అవకాశం లేకుండా జగన్ పాలన… వీటన్నింటి మద్య టీడీపీ కార్యకర్తలు కాస్త సైలంటుగానే ఉన్నారనుకోవాలి. కరోనా సమయంలో వారి సహాయ కార్యక్రమాలు కూడా అంతంతమాత్రంగానే సాగాయి. మహానాడు సమయంలో కూడా.. ఆ కార్యక్రమం ఆన్ లైన్ అవ్వడంతో వారికి పనిలేకుండా పోయింది! ఈ సమయంలో ఉన్నపలంగా టీడీపీ శ్రేణులకు కాస్త కదలిక తీసుకొచ్చారు జగన్ అనే చెప్పాలి!
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ కార్యకర్తలు, నాయకుల నిరసనలు తెలుపుతున్నారు. అచ్చెన్నాయుడును వెంటనే విడుదల చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు మార్గ మధ్యలో ఉన్న తెలుగుదేశం నాయకులు అందరినీ పోలీసులు హౌస్ అరెస్ట్ చెయ్యటం లేదా అదుపులోకి తీసుకోవటం చేస్తున్నారు. ఇది కరోనా సమయం… పదేసిమందిని వేసుకుని రోడ్లపైకి వస్తే ఇలాగే చేస్తాం అని పోలీసులు చెబుతున్నారు!
ఈ విషయంలో కేవలం కార్యకర్తలే కాదు… ఇంతకాలం పార్టీకి సంబందించిన కార్యక్రమాలు ఏమీ లేక ట్విట్టర్ కే పరిమితమైన చాలా మంది టీడీపీ నేతలు కూడా రోడ్లపైకి వచ్చేప్రయత్నం చేశారు. ఉన్నారా లేరా అనే అనుమానం కలిగేలా ప్రవర్తించిన ఇంకొదరు నేతలు కూడా బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో… ఇంతకాలం సైలంటుగా ఉన్న టీడీపీ నాయకుల్లో జగన్ ఉత్సాహం తీసుకొచ్చారని.. ఫలితంగా టీడీపీ శ్రేణులకు అచ్చెన్న అరెస్టుతో జగన్ శుభవార్త చెప్పినట్లయ్యిందని అంటున్నారు!