ప్రధాన నరేంద్ర మోడీ దేశంలోని రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఇప్పటి వరకు పలు పథకాలను తీసుకు వచ్చి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో దేశంలోని రైతులందరికి ఎంతో ఉపయోగకరంగా ఉన్న పథకం కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు మూడు విడతల్లో రూ. 6వేలను వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పుడు మరో స్కీం తో రైతులకు మరింత లాభం చేకుర్చేందుకు కేంద్రం సిద్దమైంది.
ఆ స్కీం పేరే.. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన. ఈ స్కీంలో రైతులు చేరడం వలన 60 ఏళ్ల తరువాత పెన్షన్ పొందే అవకాశం ఉంది. ఈ పథకానికి అర్హులు కావాలంటే రైతులకు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఫండ్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటూ ఉంటే.. రైతులకు ఈ స్కీమ్ తో మంచి లాభం చేకురుతుంది. ఈ స్కీమ్ లో చేరే రైతులు వారి వయస్సును బట్టి రూ. 55 నుంచి రూ. 200 వరకు ప్రతి నెలా ప్రీమియం చెల్లించాలి. వయస్సును బట్టి ఈ ప్రీమియం చెల్లింపులో మార్పులు చేర్పులు ఉంటాయి.
మన దేశంలోని 21 లక్షల మంది రైతులు ఇప్పటికే ఈ స్కీమ్ లో చేరిపోయారు. ఈ స్కీమ్ కు అర్హులైన రైతులు ఎంత త్వరగా చేరితే అంత మంచి ప్రయోజనాలను ఆస్వాధించొచ్చు. త్వరగా చేరితే తక్కువ ప్రీమియం చేల్లించాల్సి వస్తుంది. అలాగే ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చు. దేశంలోని రైతులు ఎవరైనా ఈ స్కీమ్ లో చేరొచ్చు. అయితే 5 ఎకరాల లోపు పొలం ఉంటే మాత్రమే ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందడానికి అర్హులు. సమీపంలోని బ్యాంక్ లను, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బ్రాంచ్ లను సంప్రదించి ఈ స్కీం గురించి తెలుసుకోవచ్చు.