ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు వినిపించింది.
పోలవరం ప్రాజెక్టుకు త్వరలోనే నిధులు ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ మేరకు సోమవారం హామీ ఇచ్చారు.
పోలవరం సంగతి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల & నీటివనరుల అభివృద్ధి శాఖామాత్యులు అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్ దాస్, పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి, గోరంట్ల మాధవ్, లావు కృష్ణదేవరాయలతో కలిసి కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ కు సంబందించిన బకాయిలు, పునరావాసం ప్యాకేజీ నిధుల, పోలవరం ప్రాజెక్టు రీయింబర్స్మెంట్ నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా కృష్ణ ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు జరిగే ప్రయోజనాలను గురించి కూడా ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి తెలిపారు.
అందుకే ఆలస్యం అయిందట
ఈ సమావేశం అనంతరం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో చేపట్టబోతున్న ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోరామని , దానికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్రానికి అన్ని విధాలా కేంద్ర సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి కి చెప్పమని కేంద్రమంత్రి అన్నట్లు రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విలేఖరులకు చెప్పారు. కరోన నేపథ్యంలో నిధుల విడుదల కొంత ఆలస్యమైందని, త్వరలోనే నిధులు విడుదల చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు మంత్రి అనిల్ తెలిపారు.
కేంద్రం గుడ్ న్యూస్
2021 డిసెంబర్ నాటికల్లా పోలవరం పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు విన్నవించినట్లు విలేఖరులకు రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. వరదల సమయంలో నూ పోలవరం ప్రాజెక్టు పనులను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ఆర్ అండ్ ఆర్ పనులు వేగంగా జరుగుతున్నాయని, కేంద్రం నుంచి త్వరితగతిన నిధులు వస్తే ఆ పనులు మరింత వేగంగా పూర్తవుతాయని కేంద్ర జల్ శక్తి మంత్రికి వివరించినట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నాలుగు వేల కోట్ల రూపాయల పోలవరం బకాయిలు త్వరలోనే విడుదల చేస్తామని కేంద్రమంత్రి తెలిపారని చెప్పారు.
త్వరలోనే ఆ సమావేశం
కరోన కారణంగా అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ వాయిదా పడిందని పేర్కొన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్
అపెక్స్ కౌన్సిల్ సమావేశం తేదీ త్వరలోనే నిర్ణయిస్తామని కేంద్ర మంత్రి చెప్పినట్లు వెల్లడించారు. ఎప్పుడు మీటింగ్ జరిగినా రాష్ట్ర వాదనను ముఖ్యమంత్రి బలంగా వినిపిస్తారని, ఆయా అంశాలను సానుకూలంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.