Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో సామాన్యుడికి ఒక మంచి వార్త …ఒక చెడు వార్తా ఉన్నాయి.
ఇకపై అన్ని ప్రాంతాల్లో వన్ నేషన్-వన్ రేషన్ అమలు కాబోతుండడం మంచి వార్త అయితే ..పెట్రోల్ డీజిల్పై సుంకం శాతం పెంచడం అనేది చెడు వార్త.వివరాల్లోకి వెళితే …
బడ్జెట్ లో రేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వన్ నేషన్-వన్ రేషన్ విధానం ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని అన్ని ప్రాంతాల్లో పూర్తి స్తాయిలో అమలు చేయనున్నారు. వలస కార్మికులు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం రేషన్ తీసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వన్ నేషన్-వన్ రేషన్ విధానం విజయవంతంగా అమలవుతోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
Nirmala Sitharaman :పెట్రో వాత పెట్టిన కేంద్రం!
బడ్జెట్ లో కామన్ మ్యాన్(సామాన్యుడికి) ఎలాంటి ఊరట ఇవ్వని కేంద్రం.. భారీ షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. కామన్ మ్యాన్ కి పెట్రో వాత పెట్టింది. పెట్రోల్, డీజిల్ పై వ్యవసాయ సెస్(సుంకం) విధిస్తున్నట్లు ప్రతిపాదనలు చేసింది. లీటర్ పెట్రోల్ పై రూ.2.50, డీజిల్ పై రూ.4 వ్యవసాయ సెస్ విధిస్తున్నట్లు కేంద్రం ప్రతిపాదనలు చేసింది. ఈ కారణంగా ఇప్పటికే సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న చమురు ధరలు మరింత పెరగనున్నాయి.డీజిల్, పెట్రోల్ ట్యాక్సుల విషయంలో మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సుంకం విధించారు. ఎక్సైజ్ డ్యూటీలో రాష్ట్రాలకు వాటా, సెస్సు మొత్తం కేంద్రం ఖజనాకే చేరనుంది. మార్పులు చేర్పులతో రాష్ట్రాల ఆదాయానికి భారీగా గండి పడనుంది. కాగా, అగ్రి ఇన్ఫ్రా సెస్ తో లీటర్ పెట్రోలు ధర సెంచరీ దాటడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100కు చేరిన సంగతి తెలిసిందే.
ట్యాక్స్ పేయర్స్ కు నిరాశే!
ఇక ఎంతో కాలంగా ఆదాయపు పన్ను శ్లాబ్ మారుస్తారన్న ఆశతో ఉన్న ట్యాక్స్ పేయర్స్ కి కూడా కేంద్రం మొండి చేయి చూపింది.నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఆదాయపన్ను స్లాబ్ లకి సంబంధించి ఎలాంటి ప్రకటనా చేయలేదు.ఫలితంగా ఇప్పుడున్న శ్లాబులే కొనసాగబోతున్నాయని స్పష్టమవుతోంది.ఇది ఉద్యోగవర్గాలకు తీవ్ర నిరాశ కలిగించింది.