చైనాలో పురుడు పోసుకున్న కరోనా (కోవిడ్ -19) మహమ్మారి ప్రపంచంలోని అన్ని దేశాలను వణికిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాలకు కరోనా విస్తరించింది. దీనితో పెద్దలతో పాటు పిల్లలకు, నిరక్షరాస్యులకు కరోనా అంటే తెలిసి పోయింది. కరోనా మూలంగా అటు ప్రభుత్వాలకు, ఇటు ప్రజలకు పెద్ద ఎత్తున నష్టం జరిగినప్పటికీ ప్రజానీకానికి తెలియకుండా కరోనా మేలు కూడా చేసింది.
కరోనా అంటే ప్రతి ఒక్కరికీ ఒక భయం ఏర్పడింది. కరోనా కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని పెద్ద ఎత్తున అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహించడంతో దాదాపుగా అన్ని దేశాలలో 70 నుండి 80 శాతం పాటిస్తున్నారు. కరోనా కట్టడికి ప్రజలు భయంతో జాగ్రత్తలు పాటించడం వల్ల సీజనల్ గా వచ్చే ఇన్ ఫ్ల్యూయెంజా కేసులు గణనీయంగా తగ్గాయి. ఈ విషయాన్ని వైద్య నిపుణులు ద్రువీకరిస్తున్నారు.
కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల కారణంగా ఇన్ ఫ్ల్యూయెంజా కేసులు గణనీయంగా తగ్గాయని కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, చైనా తదితర దేశాలు వెల్లడించాయి. దక్షిణ కొరియాలోనూ గత ఏడాదితో పోలిస్తే 83 శాతం మేర అంటువ్యాధులు తగ్గినట్లు సమాచారం. భారత దేశంలోనూ వర్షా కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు తక్కువగా నమోదు అవ్వవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఇప్పటి వరకు కరోనాకు వ్యాక్సిన్ రాలేదు. మందులు రాలేదు. అయినప్పటికి సాధారణ వైద్యంతోనే కరోనాను జయిస్తున్నారు. చాలా మందికి ఎటువంటి లక్షణాలు లేకుండానే కరోనా వస్తుంది, వారికి తెలియకుండానే వెళ్ళిపోతుంది. నేటి వరకు ఇండియాలో 18,55,745 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చాలా తక్కువ శాతం అంటే 38,938 మంది మాత్రమే మృతి చెందారు. 12,30,509 మంది కరోనా నుండి రికవరీ అవ్వగా 5,86,298 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.