ఎట్టకేలకు ప్రజాగ్రహానికి తలొగ్గి శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే రాజీనామా చేశారు. రాజీనామా చేయకుండా దేశం విడిచి పారిపోయిన గొటబాయ తొలుత మాల్దీవులు, అక్కడి నుండి నేడు గట్టి భద్రత మద్య సింగపూర్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ జెట్ లో సింగపూర్ చేరుకున్న వెంటనే గొటబాయ తన రాజీనామా లేఖను శ్రీలంక స్పీకర్ కు పంపించారు. గొటబాయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో శ్రీలంకలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. రోడ్ల మీదకు వచ్చి నృత్యాలు చేస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
మరో పక్క గొటబాయ రాజపక్స వ్యక్తిగత పర్యటన నిమిత్తం సింగపూర్ కు వచ్చినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గొటబాయ రాజపక్సకు ఆశ్రయం కోరలేదు, అతనికి ఆశ్రయం ఇవ్వలేదని సింగపూర్ వెల్లడించింది. తొలుత శ్రీలంక నుండి మాల్దీవులకు చేరుకున్న గొటబాయ రాజపక్సే తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలను ప్రధాని రణిల్ విక్రమ్ సింఘేకి అప్పగించారు. తొలుత బుధవారం (13వ తేదీ) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని గొటబాయ రాజపక్స ప్రకటించిన నేపథ్యంలో నిన్ననే స్పీకర్ కు లేఖ పంపుతారని భావించారు. కానీ మాల్దీవుల నుండి సింగపూర్ వచ్చిన తర్వాత ఆయన రాజీనామా లేఖను పంపించారు.
మరో పక్క దేశంలో తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న రణిల్ విక్రమ్ సింఘే పైనా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలో పరిస్థితులను అదుపు చేసేందుకు గానూ ఎలాంటి చర్యలైనా తీసుకునేందుకు సైన్యానికి అధికారాన్ని ఇచ్చారు విక్రమ్ సింఘే. శ్రీలంక లో శాంతియుత అధికార మార్పిడికి కొన్ని ఫాసిస్ట్ శక్తులు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు వికమ్ సింఘే. పరిస్థితులు చక్కబడేందుకే ఎమర్జెన్సీతో పాటు కర్ఫ్యూని ప్రకటించినట్లు విక్రమ్ సింఘే వీడియో సందేశాన్ని ఇచ్చారు.
దేశంలో అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని పార్టీలతో సమావేశం అవుతున్నట్లు రణిల్ విక్రమ్ సింఘే పేర్కొన్నారు. గొటబాయి రాజపక్స అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అంశంపై స్పీకర్ కార్యాలయం రేపు అధికారికంగా ప్రకటన విడుదల చేయనుంది. అధ్యక్షుడు రాజీనామా చేసిన నేపథ్యంలో స్పీకర్ మూడు రోజుల్లో పార్లమెంట్ ను సమావేశపర్చి నూతన అధ్యక్షుడి ఎన్నికకు ప్రక్రియ ప్రారంభించి నెల రోజులలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.