ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్పై ఇప్పటి వరకూ ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ఫేక్ వార్తలు (అసత్య కథనాలు) సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రింట్ మీడియా వ్యవహారాలను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ), వార్తా ఛానళ్లను న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్బీఎ) పర్యవేక్షిస్తుంటుంది. ప్రకటనల వ్యవహారాలన అడ్వర్టయిజింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చూస్తుంది. సినిమా విషయాలను సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) పర్యవేక్షిస్తుంది. ఇప్పటి వరకూ డీజిటల్ కంటెంట్ను నియంత్రించేందుకు ఎలాంటి చట్టం లేదా స్వయంప్రతిపత్తి బాడీ లేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకున్నది.
ఆన్లైన్ న్యూస్ పోర్టల్ మరియు నెట్ ప్లిక్స్ వంటి కంటెట్ ప్రొవైడర్స్ని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కిందకు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
స్వయం ప్రతిపత్తి గల ఓటీటీ ప్లాట్ ఫామ్లను నియంతించాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్పై గత నెలలో సుప్రీం కోర్టు విచారణ జరిపింది. దీనిపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. దీనిపై ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా నియంత్రణకు ఇప్పటికే సరిపడా నిబంధనలు ఉన్నాయనీ, డిజిటల్ మీడియాను నియంత్రించాల్సిన అవసరం ఉందని కేంద్రం తన అభిప్రాయాన్ని వెల్లడించింది.