ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య సయోధ్య కుదిరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బడ్జెట్ 2023 – 24 కు గవర్నర్ ఆమోదం లభించింది. దీంతో మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. మూడు లక్షల కోట్లతో రూపొందించిన తెలంగాణ పద్దుపై గవర్నర్ తమిళిసై సంతకం చేసి ఆమోదించారు. ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసిఆర్ సర్కార్ ఇప్పుడు ప్రవేశపెడుతున్నది చివరి బడ్జెట్. అందుకే భారీ అంచనాలు ఉన్న బడ్జెట్ పై కేసిఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తొంది.
నిన్నటి వరకూ గవర్నర్, సర్కార్ ఎవరికి వారే పట్టుదలతో ఉండటంతో బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. చివరకు ఈ అంశంపై ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే వరకూ వెళ్లింది. అయితే హైకోర్టులోని అడ్వొకేట్ జనరల్ ఛాంబర్ లో ప్రభుత్వ తరపు న్యాయవాది, గవర్నర్ తరపు న్యాయవాది జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. ప్రభుత్వం ఒక మెట్టు దిగి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని తెలియజేయడంతో పాటు లంచ్ మోషన్ పిటిషన్ ను ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో బడ్జెట్ ఆమోదానికి గవర్నర్ అంగీకరించారు. అయితే ముందుగా ప్రకటించినట్లుగా మూడో తేదీన ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ ను ఆరవ తేదీకి మార్చారు.
పుదుచ్చేరి పర్యటన ముగించుకుని నిన్న సాయంత్రం హైదరాబాద్ తిరిగి వచ్చిన గవర్నర్ తమిళిసై తో మంత్రి ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు. బడ్జెట్ ప్రతిపాదనకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం తరపున గవర్నర్ ను కోరడంతో పాటు బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించేందుకు రావాల్సిన ఆహ్వానించారు. ఉభయ సభల ప్రొరోగ్, తిరిగి సమావేశం అయ్యేందుకు నోటిఫికేషన్, గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిఫారసు తదితర అంశాలపై గవర్నర్ తో చర్చించారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రసంగ పాఠాన్ని గవర్నర్ కు అందించారు. ఇదే క్రమంలో పెండింగ్ బిల్లులపై చర్చకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తొంది.
గతంలో రెండు సార్లు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసీందే. ఈ సారి కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావించినా చివరి నిమిషంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. గవర్నర్ ఆమోదం నేపథ్యంలో ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల తేదీని ఖరారు చేసింది. ఫిబ్రవరి 3 నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, ఆ రోజు మధ్యాహ్నం గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 6న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం .. తొమ్మిది మంది మృతి