Mortuary Assistant: దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క దృష్టాంతం చాలు.ప్రభుత్వ ఉద్యోగం కోసం పడిగాపులు కాస్తున్న అత్యున్నత విద్యార్హతలు కలిగిన నిరుద్యోగులు కూడా అది ఏమిటి?ఎంత తక్కువ స్థాయికి అన్నది కూడా ఆలోచించకుండా దరఖాస్తు చేస్తున్నారు. చివరకు శవాలను నిల్వవుంచే మార్చురీలో ఉన్న ఉద్యోగాలకు ఇంజినీర్లు, పోస్టుగ్రాడ్యుయేట్లు కూడా పోటీపడి అప్లై చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.
ఆరు పోస్టులకు ఎనిమిది వేల దరఖాస్తులు!
కోల్కతా లోని నీల్ రతన్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ ల్యాబరేటరీ లో ఆరు సహాయక పోస్టులు ఖాళీ ఉన్నాయని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలంటూ ఈమధ్యే పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. వీరి పని మార్చురీలోని శవాలు కాపలా కాయడమే!పశ్చిమ బెంగాల్లో మార్చురీలను అక్కడి పరిభాషలో డోమ్ అని పిలుస్తారు. అలాంటి డోమ్ లో సహాయకుల ఉద్యోగాలకు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణుడై వుండి నలభై ఏళ్లలోపు వయసున్న వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.ఇందుకు నెలసరి జీతం పదిహేను వేల రూపాయలుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.ఈ ఆరు పోస్టులకు ఎనిమిది వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.ఈ సంఖ్యను చూసి ఆశ్చర్యపోనవసరం లేదు.ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ మాత్రం పోటీ ఉండటం ఏమాత్రం అసాధారణం కాదు.మరి ఇంక ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? అసలు విషయం చదవండి మరి
విస్తుపోవాల్సిన విషయం ఏమిటంటే ?
ఈ పోస్టులకు విద్యార్హత కేవలం ఎనిమిదో తరగతి కాగా అత్యున్నత విద్యార్హతలున్న దాదాపు మూడువేల మంది కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.వంద మంది ఇంజినీర్లు, ఐదువందల మంది పోస్టుగ్రాడ్యుయేట్లు, రెండువేల రెండువందల మంది గ్రాడ్యుయేట్లు నుండి దరఖాస్తులు అందాయని ఆస్పత్రి అధికారి ఒకరు ధ్రువీకరించారు.నిజానికి ఈ కింది స్థాయి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఉన్న విద్యార్హతలు చూసి అధికారులే విస్తుపోయారు.పోనీ నెల జీతం అధికంగా ఉందా అంటే అదీ లేదు. కేవలం పదిహేను వేల రూపాయలే నెలకు ఇచ్చేది.దానికి కూడా ఇంజినీర్లు,పోస్టుగ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు పోటీ పడటం మాత్రం అసాధారణమైన విషయం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.నిరుద్యోగ భారతమా … నిండు నూరేళ్ళు వర్ధిల్లు!!