Corona Virus: అర కోటికి పైగా పాజిటివ్ కేసులు, దాదాపు లక్షకు చేరువలో కరోనా మరణాలతో సెకండ్ వేవ్ లో భారతదేశంలోనే తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్ర ప్రభుత్వం తనకు సాధ్యమైనంతగా ఈ ఉద్ధృతిని తగ్గించడానికి చర్యలు తీసుకుంది.కొద్దిగా పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ ఇంకా రోజూ వేల సంఖ్యలోనే పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపధ్యంలో ఒక వినూత్న పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఆ పథకమే “మై విలేజ్ కరోనా ఫ్రీ”
కేవలం 16 కోట్ల రూపాయల ఖర్చుతో గ్రామాల నుండి కరోనాను తరిమేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ వినూత్న పథకాన్ని ప్రకటించింది.కొన్ని గ్రామాల్లో ఇప్పటికే స్వచ్ఛందంగా కరోనాను నిర్మూలించేందుకు గ్రామస్థులు తగిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వాటిని అధ్యయనం చేశాక “మై విలేజ్ కరోనా ఫ్రీ”పోటీ పథకాన్ని ప్రకటించారు.ఈ పథకంలోని ముఖ్య అంశమేంటంటే ఏయే గ్రామపంచాయతీలైతే కరోనా రహిత గ్రామాలుగా తయారవుతాయో వాటికి ప్రోత్సాహక బహుమతులు ఇస్తారు. మహారాష్ట్రలో ఉన్న ఆరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని మూడేసి గ్రామ పంచాయతీలకి అంటే మొత్తం పధ్ధెనిమిది గ్రామాలకు నగదు బహుమతులు అందజేస్తారు.ఆ నగదు బహుమతి కూడా భారీగానే ఉంది.
Read More: Corona: కరోనాతో కాదు ఎలుకలతో చస్తున్నాం… భారత్ ను సహాయం కోరిన ఆ దేశం
ఈ పోటీ పథకం వివరాలు!
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హసన్ ముష్రిఫ్ బుధవారం ఈ పోటీ పథకం వివరాలను ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ విభాగంలో కొవిడ్ -19 నిర్వహణలో మంచిగా పని చేస్తున్న మూడు గ్రామ పంచాయతీలకు బహుమతులు ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.గెలిచిన గ్రామాలకు మొదటి బహుమతి రూ. 50 లక్షలు, రెండవది రూ. 25 లక్షలు, మూడవ బహుమతి రూ. 15 లక్షలుగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆరు రెవెన్యూ విభాగాలు ఉండగా, మొత్తం 18 బహుమతులు ఇస్తారు. ఇందుకోసం 16.20 కోట్లు ప్రైజ్ మనీగా ఖర్చు చేస్తారు. పోటీలో గెలిచిన గ్రామాలకు బహుమతి డబ్బుతోపాటు, దానికి సమానమైన అదనపు మొత్తాన్ని ప్రోత్సాహంగా ఇస్తారని.. ఆ నిధులు గ్రామాల్లోని అభివృద్ధి పనులకు మరింత ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.ఇరవై రెండు అంశాలను ప్రామాణికంగా తీసుకుని వాటిలో ర్యాంకింగులు ఇచ్చి రెవిన్యూ డివిజన్ల వారీగా మొదటి మూడు స్థానాలు పొందిన పంచాయతీలను ఎంపిక చేస్తామని మంత్రి తెలిపారు.ఆసక్తి దాయకంగా ఉన్న ఈ పథకం దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా అనుసరణీయంగానే కనిపిస్తోంది.