గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగడంపై సర్వత్రా ఆందోళన నెలకొన్నది. మెజార్టీ నగర వాసులు ఓటింగ్ కు దూరంగా ఉండటంపై తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం అయ్యాయి. అయితే పోలింగ్ శాతం తుది గణాంకాలు వచ్చిన తరువాత చూస్తే.. జీహెచ్ఎంసీ ఆవిర్భావం తరువాత నమోదు అయిన పోల్ పర్సేంటేజీలో ఇదే రికార్డు కావడం గమనార్హం.
మంగళవారం సాయంత్రం 5 గంటల వరకూ36.73 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అర్థరాత్రి మొత్తం పోలింగ్ శాతం 45.71 గా వెల్లడించింది. కరోనా నేపథ్యంలో పోలింగ్ శాతం తగ్గుతుందని భావించినప్పటికీ గత ఎన్నికల కంటే స్వల్పంగా 0.62 శాతం పెరిగింది.
నగరంలో ఇప్పటి వరకూ పోలింగ్ శాతం ఎలా ఉందంటే…
2002లో ఎంసీహెచ్ ఎన్నికల్లో 41.22 శాతం నమోదు కాగా, జీహెచ్ఎంసీ ఆవిర్భావం తరువాత 2009లో 42.92 శాతం, 2016లో 45.29 శాతం మేర పోలింగ్ నమోదు అయ్యింది. ఈ సారి గత ఎన్నికల కంటే స్వల్పంగా 0.62శాతం పోలింగ్ పెరిగింది.
2014 సార్వత్రిక ఎన్నికలు (లోక్సభ, అసెంబ్లీ) ఎన్నికల్లో 53.00 శాతం పోలింగ్ నమోదు కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 50.86 శాతం నమోదు అయ్యింది. 2019 హైదరాబాద్ లోక్ సభ స్థానం ఎన్నికల్లో 44.75, సికింద్రాబాద్ లోక్ సభ స్థానం ఎన్నికల్లో 46.26 శాతంకు తగ్గిపోయింది.
జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లలో మొత్తం 150 డివిజన్లు ఉండగా 149 డివిజన్లకు పోలింగ్ జరిగాయి. ఓల్డ్ మలక్పేట డివిజన్లో అభ్యర్థి ఎన్నికల గుర్తు తప్పుగా ముద్రించడం వల్ల పోలింగ్ జరగలేదు. ఈ డివిజన్లో ఈ నెల 3వ తేదీన పోలింగ్ జరగనున్నది.