Suicide: మంగళవాయిద్యాల నడుమ వివాహా వేడుక జరగాల్సిన వేళ ఆ ఇంట చావు బాజా మోగింది. తెల్లవారితే పెళ్లి పీటలపై కూర్చుని వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడు తన మెడకే ఉరి తాడు వేసుకుని అర్ధాంతరంగా తనువు చాలించాడు. దీంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్పల్లికి చెందిన పట్టెబర్ల యాదమ్మ, లింగం గౌడ్ దంపతుల చిన్న కుమారుడు శ్రీకాంత్ గౌడ్ (25) కు కుందుకూర్ మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి చేసేందుకు 20 రోజుల క్రితం నిశ్చితార్థం అయ్యింది. వీరి వివాహం శుక్రవారం (జూన్ 4వ తేదీ) జరగాల్సి ఉంది. లింగం గౌడ్ సమీప బంధువులు పెళ్లి వేడుకకు వచ్చారు. బుధవారం రాత్రి వరుడు శ్రీకాంత్ గౌడ్ భోజనం చేసి తమ పాత ఇంట్లో నిద్రించాడు. గురువారం ఉదయం అతని అన్న ప్రభాకర్ గౌడ్ వెళ్లి నిద్ర లేపి అతని వద్ద ఉన్న బైక్ తాళం చెవి తీసుకుని పొలానికి వెళ్లాడు. మేడి కొమ్మ తీసుకుని కొత్త ఇంటి వద్ద పందిరి వేసేందుకు సిద్ధం చేశాడు. బంధువులు అంతా వివాహ వేడుక జరిగే కొత్త ఇంటి వద్ద ఉన్నారు.
కాగా ఉదయం 5గంటల ప్రాంతంలో శ్రీకాంత్ గౌడ్ ను పెళ్లి కొడుకును చేసేందుకు తీసుకురావాలని అన్న ప్రభాకర్ గౌడ్ ను పాత ఇంటికి పంపించారు. ప్రభాకర్ గౌడ్ పాత ఇంటి తలుపులు ఎంత సేపు కొట్టినా తలుపు తీయకపోవడంతో తలుపులు విరగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ ఉరివేసుకొని విగత జీవిగా వేలాడుతూ కనిపించాడు. విషయాన్ని పెద్దలు చెప్పడంతో కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడకు వచ్చి బోరుబోరున విలపించారు.
పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు అర్థంతరంగా షాక్ ఇచ్చి వెళ్లిపోవడంతో కన్నీటిపర్యంతమయ్యారు. ఈ విషయం తెలిసి వధువు కుటుంబంలోనూ విషాదాన్ని నింపింది. మృతుడి తల్లి యాదమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాంత్ గౌడ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. తమ సోదరుడు ఇష్టపడిన అమ్మాయితోనే వివాహం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామనీ, ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదని శ్రీకాంత్ గౌడ్ అన్న ప్రభాకర్ గౌడ్ తెలిపారు. మంగళవాయిద్యాల నడుమ వివాహ వేడుక జరగాల్సిన ఇంట్లో చావు బాజా మోగడం గ్రామస్తుల హృదయాలను కలచివేసింది.