భారతీయ జనతా పార్టీ అక్రమ కార్యకలాపాలు, పార్టీకు విధేయంగా లేని వారిపై కొరడా ఝళిపిస్తున్న విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైన సోము వీర్రాజు ఇప్పుడు మరో నేతపై సస్పెన్షన్ వేటు వేశారు. అక్రమంగా మద్యం తరలిస్తూ అడ్డంగా దొరికిపోయిన బీజేపీ నేత గుడివాక రామాంజనేయులు అలియాస్ అంజిబాబును సోము వీర్రాజు సస్పెండ్ చేసారు.
ఈ మేరకు ఆదివారం ఓ లేఖను విడుదల చేయగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నం ఎంపీ స్థానానికి 2019 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన రామాంజనేయులు ఓటమి పాలయ్యారు. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా సురేశ్, నరేశ్ అనే ఇద్దరు వ్యక్తులతో పాటు రామాంజనేయులును కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసారు.