Gujarat: రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుండి బీజేపీ కేంద్ర అధిష్టానం దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను బీజేపీ మారుస్తోంది. ఇటీవలే కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్పను దించేసి ఆయన సామాజిక వర్గం లింగాయత్ లకే మళ్లీ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ ను, అసోంలో సీఎం శర్బానంద సోనోవాల్ ను కమలనాధులు తప్పించారు. తాజాగా గుజరాత్ సీఎం ను మార్పు చేశారు. గుజరాత్ లో వచ్చే ఏడాది డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. విజయ్ రుపాణిని మరో ఏడాది పాటు కొనసాగించడం వల్ల రాబోయే ఎన్నికల్లో బీజేపీకి నష్టం జరుగుతోందని భావించి ఆ రాష్ట్రంలో కీలక ఓటు బ్యాంక్ ఉన్న భూపేంద్ర పటేల్ ను సీఎంగా ఎంపిక చేసింది.
రుపాణి ముఖ్యమంత్రి గా సుమారు నాలుగేళ్ల పాటు కొనసాగినా పార్టీ బలోపేతం కాలేదన్న భావనలో కేంద్ర బీజేపీ ఉంది. రూపాణి సామాజిక వర్గ ఓట్లు రాష్ట్రంలో రెండు శాతం మాత్రమే. ప్రధాన మంత్రి నరేంద్ర, హోంశాఖ మంత్రి అమిత్ షా ల సొంత రాష్ట్రమైన గుజరాత్ లో రాబోయే ఎన్నికల నాటికి పార్టీ బలోపేతం అయి మరో సారి విజయం సాధించేందుకు బీజేపీ వేసిన వ్యూహాత్మక అడుగు అని పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు. విజయ్ రూపాణి నాయకత్వంలో పార్టీ ఆశించిన మేర రాణించలేదని బీజేపీ అగ్రనేతల భావన. అదే విధంగా కరోనా మహమ్మారి సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విముఖత పెరగడం కూడా రూపాణి తొలగింపునకు ఒక కారణం అని తెలుస్తోంది. ఇటీవల సూరత్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి బలమైన మద్దతు లేకుండానే అమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాలను గెలుచుకుంది. ఇది బీజేపీ శిబిరంలో ఆందోళనకు కారణమైంది.