కరోనా వైరస్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ స్థాయిలోనే ప్రభావం చూపుతోంది. కరోనా వైరస్ కారణంగా ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ఇంకా మొదలుకానేలేదు. మొదట జులై అనుకుని తర్వాత అక్టోబర్ ఆ తర్వాత నవంబర్ కు మారింది. ఈలోగా ఆన్లైన్ క్లాసులు, ట్యూషన్లతో చిన్నారుల చదువు జరుగుతోంది.
అయితే గుంటూరులోని సత్తెనపల్లి మండలం భట్లూర్ లో జరిగిన ఒక సంఘటన అందరినీ కలవరపెడుతోంది. ఆ గ్రామంలో ఒక ట్యూషన్ టీచర్ ఆనారోగ్య బారిన పడడంతో కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ట్యూషన్ కు వెళ్లిన పిల్లలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 15 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారందరూ ఏడేళ్ల లోపు పిల్లలే కావడం గమనార్హం. ప్రస్తుతం వారిని ఎన్ఆర్ఐ క్వారంటైన్ సెంటర్ కు తరలించారు.