కవికోకిల గుర్రం జాషువా 125వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం
——————————————————————–
‘కులమతాలు గీచుకున్న గీతలు జొచ్చి
పంజరాన గట్టు వడను నేను
నిఖిలలోక మెట్లు నిర్ణయించిన
నాకు తరుగు లేదు విశ్వనరుడ నేను’
పుట్టుకతో దళితుడైన ఈయన పట్టుదలతో కవిశేఖరుడై, నవయుగ కవిచక్రవర్తై, తన కవితాప్రతిభతో తెలుగు సాహితీ లోకంలో ప్రజ్వరిల్లిన తేజోమూర్తి, విశ్వమానవుడు గుర్రం జాషువా!
ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా సమకాలీన కవిత్వ వరవడియైన భావ కవిత్వపు రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా, ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు.
కళకు కులమతాలున్నాయా? అంటూ శ్రీ జాషువా ప్రశ్నిస్తూ– “నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి, రూపు రేఖా కమనీయ వైఖరులు గాంచి భళీభళీ; యన్నవారే, మీదేకుల మన్నప్రశ్నవెలయించి, చివాలున లేచిపోవుచో బాకున గ్రుమ్మినట్లగున్ పార్ధివ చంద్ర! వచింప సిగ్గుగన్!” అంటూ తన ఆవేదన చెప్పుకున్నాడు. జాషూవాను గురించి తెలుకోవటం అంటే ఆశపడటం, ఆరాటపడటం, పోరాటం చేయటం, అవమానాలు పొందటం వంటివి తెలుసు కోవటమే. సాగరంలోని ఆటుపోట్లు అపారం, తెలిసేవి మాత్రం కొన్నే. జాషూవా జీవిత సాగరమూ అంతే.
జాషువా 28 -09 -1895 న వీరయ్య, లింగమ్మ దంపతులకు, గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించాడు. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు. తండ్రి యాదవ, తల్లి మాదిగ. ఈ ఒక్క విషయం చాలు,మూఢాచారాలతో నిండిన సమాజంలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కోడానికి!1910 లో మేరీని పెళ్ళి చేసుకున్నాడు. మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేశాడు.
ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్ళి 1915 -16లో అక్కడ సినిమా వాచకుడిగా పనిచేశాడు. టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్నకథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువుతూ పోవడమే ఈ పని. తరువాత గుంటూరులోని లూథరన్ చర్చినడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా10 సంవత్సరాల పాటు పనిచేశాడు. తరువాత 1928 నుండి 1942 వరకు గుంటూరులోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేశాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేశాడు. 1957-59మధ్య కాలంలోమద్రాస్ రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్వాహకుడిగా పనిచేశాడు. జీవనం కోసం ఎన్నోరకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు,1964 లో, ఆంద్ర ప్రదేశ్ శాసనమండలిలో సభ్యత్వం లభించింది.బాల్యస్నేహితుడు, తరువాతి కాలంలో రచయిత అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సాహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి హనుమచ్ఛాస్త్రి వద్ద మేఘసందేశం కుమారసంభవం, రఘువంశం నేర్చుకున్నాడు. జాషువా 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు వ్రాశాడు. వాటిలో ప్రముఖమైనవి-క్రీస్తుచరిత్ర , గబ్బిలం, పిరదౌసి, రుక్మిణీకళ్యాణం, మశానవాటిక, వివేకానంద, జేబున్నీసా, నాగార్జునసాగరం, కాందిశీకుడు. ‘నా కథ’ పేరుతో వారి ఆత్మకథను కూడా వ్రాసుకున్నారు.గబ్బిలం (1941) ఆయన రచనల్లో సర్వోత్తమమైనది. కాళిదాసు మేఘసందేశం తరహాలో సాగుతుంది. అయితే యిందులో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోకి దళితునకు ప్రవేశంలేదు కాని గబ్బిలానికి అడ్డు లేదు. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది.ఎన్నో బిరుదులు, సత్కారాలు అందుకున్నాడాయన. కవితా విశారద, కవికోకిల, కవి దిగ్గజ – నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ గా ప్రసిద్ధుడయ్యాడు. పద్మభూషణ్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కళాప్రపూర్ణ, మొదలైన పురస్కారాలు అందుకున్నాడు. 1971జులై 24వతేదీన ఆయన అంతిమశ్వాస విడిచారు