హైదరాబాదు: తెలంగాణ నూతన సచివాలయం, శాసనసభ నిర్మాణాలకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎన్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పిటిషన్పై విచారణ జరిపింది. తదుపరి ఉత్తర్వులు వెల్లడించేంత వరకూ సచివాలయం, ఎర్రమంజిల్ భవనాలను కూల్చవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కౌంటర్ దాఖలు చేయడానికి తమకు 15రోజుల గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరగా అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. దీంతో మధ్యాహ్నమే కౌంటర్ దాఖలు చేస్తామని అదనపు అడ్వకేట్ జనరల్ బదులిచ్చారు. కోర్టు విచారణను మధ్యాహ్నం 2.15గటలకు వాయిదా వేసింది. మధ్యాహ్నం విచారణ చేపట్టిన కోర్టు పిటిషనర్ వాదనలు విన్నది. ఈ సందర్భంగా పిటిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 214 నిబంధన ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాదులోని ప్రభుత్వ కట్టడాలపై గవర్నర్కు నిర్ణయాధికారం ఉంటుందని తెలిపారు. చారిత్రక, వారసత్వ సాంస్కృతిక కట్టడాల వయసు వంద ఏళ్ళు దాటితే వాటిని కూల్చడానికి వీల్లేదని కోర్టుకు విన్నవించారు. వంద ఏళ్లు దాటిన కట్టడాలను జాతీయ వారసత్వ సంపదగా పరిగణించాలని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ ఎర్రమంజిల్ను ఆర్కియాలజీ డైరెక్టరేట్ జాతీయ సంపదగా గుర్తించిందా అని ప్రశ్నించింది. ప్రస్తుతం ఆ వివరాలు తమ వద్ద లేవనీ, పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తామనీ పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. ఈ సందర్భంలో గూగుల్ మ్యాప్ను మరో సారి హైకోర్టు పరిశీలించింది. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసినట్లు న్యాయస్థానం ప్రకటించింది. సచివాలయం భవనం, ఎర్రమంజిల్ కోర్టు కూల్చివేతలపై సామాజిక కార్యకర్త పాడి మల్లయ్య ఈ పిటిషన్ దాఖలు చేశారు.