కరోనా వ్యాక్సిన్ ను రవాణా చేసే సంస్థల డేటాపై అంతర్జాతీయ హ్యాకర్ల బృందం కన్నేసిందని, వ్యాక్సిన్ పంపిణీ చేసే సంస్థలు జాగ్రత్తగా ఉండాలని ఐబీఎం హెచ్చరించింది. తమ నిపుణుల బృందం ఈ హ్యాకర్ల పన్నాగాన్ని తెలుసుకుందని ఐబీఎం వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ ను ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చెయ్యాలంటే కోల్డ్ చైన్ విధానం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ఐబీఎం తెలిపింది.
కోల్డ్ చైన్ విధానం అంటే వాక్సిన్ ఉత్పత్తి అయిన కేంద్రాల నుంచి అత్యంత చల్లని వాతావరణంలో వ్యాక్సిన్ ను రవాణా చేసి, అవి ప్రజల వద్దకు వ్యాక్సిన్ డోసులుగా వెళ్లేవరకు చల్లని వాతావరణంలోనే ఉంచాలని అర్ధమట. ఈ విధానంలో కరోనా వ్యాక్సిన్లను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ వద్ద భద్రపరచాల్సి ఉంటుంది మరియు మధ్యలో ఎక్కడ అయినా శీతలకరణకు ఆటంకాలు ఏర్పడితే వ్యాక్సిన్లు పాడైపోతాయట.
అయితే, రంగంలోకి దిగిన హ్యాకర్ల బృందం ఎంతో ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో కోల్డ్ చైన్ అంశంపై సమాచారం సేకరించేందుకు ప్రయత్నాలను చేస్తున్నట్లు తమ సైబర్ సెక్యూరిటీ బృందం గమనించిందని ఐబీఎం పేర్కొంది. ఈమెయిళ్ల రూపంలో ఎంతో నేర్పుగా వలలు విసురుతున్నారని మరియు ఆ ఈమెయిల్స్ కూడా చాలా తెలివిగా చైనాకు చెందిన హైర్ బయోమెడికల్ సంస్థ ప్రతినిధి పేరుతో పంపుతున్నారని ఐబీఎం వివరించింది.