Crime News: జాతీయ రహదారిపై నిశ్శబ్ద హత్యాకాండ సాగించిన మున్నా గ్యాంగ్ కు ఉరిశిక్ష పడడం వెనుక ప్రకాశం జిల్లా పోలీసుల కఠోర శ్రమ ఉంది.ఎస్పీ మొదలు కానిస్టేబుల్ వరకూ అంతా సమిష్టి కృషితో అత్యంత పక్కాగా ఈ కేసును బిల్డప్ చేయడంతోటే ఆ నరహంతక ముఠా ఉరికంబం ఎక్కనున్నది.
సాధారణంగా ఏ కేసులో అయినా నిందితులకు శిక్ష పడాలన్నా,వారు నిర్దోషులుగా విడుదల అయినా అదంతా పోలీసులు కోర్టుకు సమర్పించే ఛార్జిషీట్లు ప్రవేశపెట్టే సాక్షులు, సాక్ష్యాధారాల మీదనే ఆధారపడి ఉంటుంది.పోలీసులు ఈ ప్రక్రియలో ఏ చిన్నపాటి తప్పు చేసినా నిందితుల తరపు లాయర్లు దాన్ని ఆసరాగా చేసుకుని కేసులు గెలుస్తుంటారు.పోలీసులు చేసే తప్పులే తమకు ఆలంబనని,వాటి ఆధారంగానే తాము తమ క్లయింట్లనువిడిపించుకు పోతుంటామని,అంతకుమించి తమ ప్రతిభ ఏమీ ఉండదని పలువురు సీనియర్ న్యాయవాదులు అనేక ఇంటర్వ్యూల్లో చెప్పటంగూడా ఇక్కడ గమనార్హం.అయితే మున్నా గ్యాంగ్ సాగించిన సామూహిక హత్యాకాండకు సంబంధించిన కేసులను పోలీసులు పక్కాగా దర్యాప్తు చేసి, అంతకుమించి పకడ్బందీగా చార్జిషీట్లు దాఖలు చేయటం,సాక్షులను, సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశ పెట్టడంతో న్యాయస్థానం కూడా ఎటువంటి సంశయానికి తావులేకుండా ఆ గ్యాంగ్ కు అత్యంత కఠిన శిక్షలు విధించింది.ఈ సందర్భంగా ఈ కేసులో కీలక పాత్ర వహించిన పోలీసు అధికారుల గురించి చెప్పుకోవటం ఎంతైనా సందర్భానుసారమే!
దామోదర్ కి అగ్రతాంబూలం
అసలు ఈ కేసు మూలాలు వెలికి తీసిన ఘనత దామోదర్ కి లభిస్తుంది.అప్పట్లో ట్రెయినీ డీఎస్పీగా ఒంగోలులో ఉంటూ తాలూకా పోలీస్ స్టేషన్లో ఆయన విధులు నిర్వర్తించేవారు.మున్నా గ్యాంగ్ మాయం చేసిన ఇనుప లారీ కేసు ఆ పోలీస్ స్టేషన్లోనే నమోదైంది.దీంతో దామోదర్ అన్ని కోణాల నుండి దర్యాప్తు చేపట్టారు.కొన్ని లీడ్స్ సంపాదించారు. ఈ కేసులో మున్నా గ్యాంగ్ పాత్ర ఉందని ఆయన నిర్ధారించుకున్నారు.వారు ఒంగోలులో ఉంటున్న సమాచారాన్ని కూడా సేకరించారు.ఒక సందర్భంలో ఆ ముఠా కదలికలను అరవై అడుగుల రోడ్డులో దామోదర్ గమనించారు.
చాకుల్లాంటి అధికారులతో దర్యాప్తు బృందం!
తన కథను సమాచారాన్నంతా అప్పటి జిల్లా ఎస్పీ నవీన్ చందు కి దామోదర్ తెలియజేసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేయించారు.అప్పట్లో పోలీస్ శాఖలో అత్యంత చురుగ్గా పనిచేసే అశోక్వర్ధన్రెడ్డి,శంకర్ రెడ్డి,ఆంథోనిరాజ్ లతో ఈ బృందం ఏర్పడింది. మధ్యప్రదేశ్లోని దుర్గాపూర్ నుండి ఈ బృందం దర్యాప్తు చేపట్టి ఒంగోలులో ఆ ముఠా స్థావరాన్ని కనిపెట్టేశారు. కర్నాటకలో ఒక మాజీ ఎమ్మెల్యే ఇంట్లో షెల్టర్ తీసుకున్న మున్నాను పట్టుకున్నారు.తదుపరి గ్యాంగ్ ను అరెస్టు చేశారు.అప్పటి ఎస్సైలు మొయిన్, అల్తాఫ్ హుస్సేన్ లు కూడా కీలకంగా పనిచేశారు.మధ్యలో మున్నా ఒకసారి బెయిల్ మీద బయట ఉంటూ పోలీసులకు దొరక్కుండా తిరుగుతుండటంతో ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేసి కర్నూలుకు బదిలీపై వెళ్లిన రఘురామిరెడ్డి నంద్యాల్లో అతడ్ని పట్టుకున్నారు.రెండువేల ఎనిమిది నుండి ఇప్పటివరకు పనిచేసిన ప్రతి ఎస్పీ కూడా మొన్న కేసు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపారు అనేది నిర్వివాదాంశం.
Read More : KCR: కేసీఆర్ కీలక నిర్ణయం… తెలంగాణ వాళ్లకు గుడ్ న్యూస్
కొసమెరుపు
ఈ కేసులో అత్యంత కీలకంగా వ్యవహరించిన అశోక్ వర్థన్ రెడ్డిని హత్య చేయించేందుకు మున్నా ఒక గ్యాంగ్ కు ముప్పై లక్షల రూపాయల సుపారీ కూడా ఇచ్చాడంటే అంతకుమించి పోలీసుల నిబద్ధత, నీతి నిజాయితీల గురించి చెప్పనవసరం లేదు.వీరే కాదు ఈ కేసులో మొదటి నుండి చివరి వరకు కోర్టు కానిస్టేబుళ్లుగా వ్యవహరించిన ఇద్దరు ముగ్గురు పోలీసులు కూడా తమ ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించారు.కేసు తీర్పు రావడానికి ఒకటి రెండు రోజుల ముందు కూడా వీరిలో ఒకరికి బెదిరింపులు సైతం వచ్చాయంటే పరిస్థితి తీవ్రతను అంచనా వేయొచ్చు.ఏదేమైనా భారతదేశంలోనే ఒకే కేసులో అత్యధిక ఉరిశిక్షలు పడ్డ ఘనత ప్రకాశం జిల్లాకు గర్వకారణమైతే,ఆ ఘనతంతా పోలీసులకే దక్కుతుందని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.వీరిలో దామోదర్ అశోక్వర్ధన్రెడ్డి అల్తాఫ్హుస్సేన్ మొయిన్ తదితరులంతా ఇప్పటికీ ప్రకాశం జిల్లాల్లోనే పని చేస్తుండటం కొసమెరుపు.