ఢిల్లీ, జనవరి 22: పాకిస్తాన్లోని భారత్ దౌత్యాధికారులు వేధింపులకు గురవుతున్నారు. పాకిస్తాన్ హైకమిషన్కు చెందిన అధికారి ఒకరు ఆ మధ్య ఢిల్లీలో ఒక యువతిని వేధింపులకు గురి చేయడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు. దానికి ప్రతీకారంగా వేధింపులు మొదలయ్యాయని బారత అధికారులు అంటున్నారు. దీనిపై పాకిస్తాన్లోని భారత దౌత్య సిబ్బంది ఢిల్లీలోని విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని భారత అధికారులు పాక్ దృష్టికి తీసుకువెళ్లారు.
ఇటీవల ఢిల్లీలో పాకిస్తాన్ హైకమిషన్కు చెందిన అధికారి ఒకరు ఒక అమ్మాయిని వేధించారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పాకిస్తాన్ అధికారిని అదుపులోకి తీసుకుని కొన్ని గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఈ విషయంపై మన అధికారులు పాక్ రాయబార కార్యాలయానికి సమన్లు జారీ చేశారు.
ఈ ఘటనలో పాకిస్తాన్ భారత్కు నిరసన వ్యక్తం చేసింది. తమ అధికారిని పోలీస్ స్టేషన్లో ఉంచడాన్ని తప్పుబట్టింది.
ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్లో ఉంటున్న భారత హైకమిషన్ అధికారులపై వేధింపులు పెరిగాయి. ఢిల్లీలో జరిగిన ఘటన గురించి పేర్కొంటూ ప్రతీకారం తీర్చుకుంటామంటూ భారత అధికారులకు సంతకం లేని ఒక లేఖను పంపారు. భారత్లో జరిగిన ఘటన గురించి ప్రశ్నించారు. దీంతో భారత విదేశాంగ శాఖ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. తమ అధికారులను బెదిరించడంపై దర్యాప్తు జరపాలని పాక్ అధికారులను అడిగింది. మరో సారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పింది.