సచివాలయ భవనాల కూల్చివేత వ్యవహారం మళ్లీ “ఆంధ్రోడి పెత్తనం” అనే పదాన్ని తెరపైకి తెచ్చింది. దానికి గల కారణాలు ఒకటి ఉత్తమకుమార్ రెడ్డి అయితే మరొకటి హరీష్ రావు పద ప్రయోగాలు. ఇప్పటికీ ఆ పదాలు వాడటం అవసరమా అని ఆంధ్రులు హరీష్ ను అంటుంటే.. ఆ అవసరం తెచ్చింది ఉత్తమే అనేది హరీష్ మాటగా ఉందని అంటున్నారు. ఇంతకూ అసలు ఆ రబస ఎందుకొచ్చిందంటే… సెక్షన్ – 8 ప్రస్థావన గురించి!
అసలు విభజన చట్టంలోని సెక్షన్-8 అంటే ఏమిటో ఒకసారి చూద్దాం! విభజన చట్టంలోని సెక్షన్ – 8 లెక్కప్రకారం “ఉమ్మడి రాజధాని ప్రాంతంలో శాంతిభద్రతలు, అంతర్గతభద్రత, కీలకప్రాంతాలు, సంస్థాపనల భద్రత, ప్రభుత్వభవనాల కేటాయింపు, ప్రభుత్వభవనాల నిర్వహణల ప్రత్యేక బాధ్యతలను గవర్నర్ నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులను సంప్రదించిన తర్వాత గవర్నర్ తన విచక్షణ మేరకు న్యాయమని తోచిన నిర్ణయాన్ని తీసుకొని తగినచర్యలకు ఆదేశిస్తారు”! ఇప్పుడు సచివాలయం కూల్చివేత విషయంలో ఈ సెక్షన్ – 8 ని అప్లై చేయాలని కోరుతున్నారు కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి!
అవును… రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సచివాలయ భవనాల కూల్చివేతపై ముందుగా స్పందించిన ఉత్తమ్… 2012-13 కాలంలో పూర్తైన భవనాలను కూల్చివేయడం దారుణమని.. కేసీఆర్ వాస్తు పిచ్చికి ఇది పరాకాష్ట అని అంటూ.. ఈమేరకు గవర్నర్ విభజన చట్టం ప్రకారం సెక్షన్-8 అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ మాటతో ఫైరయిన టీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు… హైదరాబాద్ పై ఇంకా ఆంధ్ర పెత్తనం ఉండాలని ఉత్తమ్ కోరుకుంటున్నట్టు ఉందని విమర్శించారు.
ఏపీ ముఖ్యమంత్రుల దగ్గర పని చేసిన ఉత్తమ్ కు ఇంకా ఆ భావాలు పోలేదని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్వచ్ఛందంగా, అధికారికంగా సెక్రటేరియల్, ప్రభుత్వ భవనాలను అప్పగించిన అనంతరం అసలు సెక్షన్-8 కు ఆస్కారమే లేదని… తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా ఇంకా హైదరాబాద్ పై ఆంధ్ర పెత్తనం ఉండాలని కోరుకుంటున్నారని ఆన్ లైన్ లో స్పందించారు.
కాగా… ఇటివల తెలంగాణ సచివాలయ భవనాలను కూల్చేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుత సచివాలయ భవనాల కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి.