YS Sharmila Party: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి,ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి, కుమార్తె షర్మిలలకు తెలంగాణ ప్రజల హృదయాల్లో స్థానమే లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ మేనల్లుడు,ఆ రాష్ట్ర ఆర్దిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులమని చెప్పుకుని వచ్చే వాళ్లను తెలంగాణ ప్రజలు ఆదరించబోరని ఆయన చెప్పారు.తెలంగాణలో వైఎస్ షర్మిల సొంత పార్టీ పెట్టాక ఆ విషయమై హరీశ్ రావు సదాశివ పేటలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణను అవహేళన చేసిన వైఎస్సార్!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక సందర్భాల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ను ను అవహేళన చేశారని మంత్రి చెప్పారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి అదేమన్నా బీడీయా.. సిగరెట్టా అని కూడా వైఎస్సార్ సాక్షాత్తూ అసెంబ్లీలో ఎగతాళి చేశారని ఆయన వెల్లడించారు. వైఎస్సార్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన తనకు ఇంకా అనేక విషయాలు తెలుసునని హరీశ్రావు చెప్పారు .తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వైఎస్సార్ అడుగడుగునా అడ్డుకున్నారన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ఆయన రాయలతెలంగాణ అనే ఒక కొత్త ప్రతిపాదనను కూడా తెరపైకి తెచ్చారని హరీశ్ చెప్పారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలంటే వందకోట్ల ప్రజల ఆమోదం లభించాలని,అది జరిగే పని కాదని వైయస్సార్ అంటూ ఉండేవారన్నారు. తాను జీవించి ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రం రాబోదని వైఎస్సార్ పదేపదే చెప్పేవారని మంత్రి వెల్లడించారు.జలాలు, నిధులు,ఉద్యోగాలను తెలంగాణా నుండి దోచుకొని ఆంధ్రప్రదేశ్ కు రాజశేఖర్రెడ్డి అప్పనంగా ఇచ్చారని కూడా హరీశ్ రావు ఆరోపించారు.ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
షర్మిల తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు ఎలా కోరుకుంటారు?
తండ్రి, అన్న తెలంగాణకు ఎంతో ద్రోహం చేస్తున్న నేపధ్యంలో ఈ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టిన షర్మిల ఈ ప్రాంత ప్రజల ఆదరణను ఎలా కోరుకుంటారని మంత్రి హరీష్రావు నిలదీశారు.అసలు తెలంగాణ ప్రజలు తనను ఆదరిస్తారని షర్మిల ఎలా అనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని వైఎస్సార్ దెబ్బతీసినందుకా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నందుకా,కృష్ణా జలాలను దోచుకున్నందుకా నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని హరీష్ తనదైన శైలిలో షర్మిలను సూటిగా ప్రశ్నించారు.వైఎస్సార్ వారసులకే తెలంగాణ గడ్డమీద స్థానమే లేదని మంత్రి తేల్చిచెప్పారు.