ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునేందుకు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు జనాలు పాన్ కార్డులను వాడుతున్న విషయం విదితమే. ప్రస్తుతం పాన్ కార్డు దాదాపుగా ప్రతి ఒక్కరికీ ఆవశ్యకమవుతోంది. అయితే చాలా మంది ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులను వాడుతున్నట్లు ఇన్కమ్ట్యాక్స్ విభాగం గుర్తించింది. దీంతో వారిపై భారీ ఎత్తున జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతోంది.
దేశవ్యాప్తంగా చాలా మంది ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులను వాడుతున్నట్లు ఇన్కమ్ట్యాక్స్ డిపార్ట్మెంట్ గుర్తించింది. కొందరు క్రెడిట్ హిస్టరీ బాగాలేకపోతే కొత్త పాన్ కార్డు తీసుకుని లోన్లను తీసుకుంటున్నారని, ఇంకొందరు పన్ను ఎగ్గొట్టేందుకు ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులను వాడుతున్నారని తేలింది. అయితే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఆదాయపు పన్ను విభాగం తెలిపింది. వారిపై రూ.10వేల వరకు జరిమానా విధిస్తామని తెలిపింది.
ఇక కొందరు తమకు తెలియకుండానే ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులను వాడుతున్నారని.. అలా చేయడం కూడా నేరం కిందకే వస్తుందని ఇన్కమ్ట్యాక్స్ విభాగం తెలియజేసింది. అందువల్ల వారు కూడా తాము వాడదలచుకున్న ఒకే కార్డును ఉంచుకుని మిగిలిన కార్డులను ఆదాయపు పన్ను విభాగానికి పంపించాలని తెలిపింది. లేదంటే వారు కూడా జరిమానా కట్టాల్సి వస్తుందని పేర్కొంది. ఇక ప్రస్తుతం ఆధార్ కార్డు, పాన్ కార్డులను అనుసంధానం చేస్తుండడంతో ఈ సమస్య కొంత వరకు తగ్గిందని, అయినప్పటికీ ఇంకా అనేక మంది ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులను వాడుతున్నారని, కనుక వారందరూ జరిమానా పడకుండా ఉండాలంటే.. తమ కార్డులను సరెండర్ చేయాలని, ఏదైనా ఒక పాన్ కార్డును మాత్రమే దగ్గర ఉంచుకోవాలని సూచించింది.