గణిత శాస్త్రమంటే చాలా మందికి భయం ఉంటుంది. కానీ శకుంతలా దేవి అనే గణిత మేథావి విద్యార్థులకు మ్యాథ్స్ పట్ల ఉండే భయాన్ని పోగొట్టారు. ఇక ఆమె ప్రపంచంలోనే వేగవంతమైన హ్యూమన్ కాలిక్యులేటర్గా కూడా రికార్డు సాధించారు. అయితే ఆమె రికార్డును ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు బ్రేక్ చేశాడు. వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ కాలిక్యులేటర్ టైటిల్ గెలుచుకున్నాడు. అతనే నీలకంఠ భాను ప్రకాష్.
భాను ప్రకాష్ ది హైదరాబాద్. వయస్సు 21 ఏళ్లు. ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న సెయింట్ స్టీఫెన్ కాలేజీలో మ్యాథ్స్ ఆనర్స్ చదువుతున్నాడు. ఇప్పటికే ఇతని పేరిట పలు వరల్డ్ రికార్డులు, 50 లిమ్కా రికార్డులు ఉన్నాయి. ఈ క్రమంలోనే భాను ప్రకాష్ ఆగస్టు 15న లండన్లో వర్చువల్గా నిర్వహించిన మైండ్ స్పోర్ట్స్ ఒలంపియాడ్లో మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ చాంపియన్షిప్లో పాల్గొన్నాడు. అందులో యూకే, జర్మనీ, యూఏఈ, ఫ్రాన్స్, గ్రీస్, లెబనాన్ వంటి 13 దేశాలకు చెందిన 57 సంవత్సరాల వరకు వయస్సు ఉన్న 30 మంది పాల్గొన్నారు. ఆ పోటీలో తన సమీప ప్రత్యర్థుల కన్నా 65 పాయింట్లు ఎక్కువగా స్కోర్ చేసి భాను ప్రకాష్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ కాలిక్యులేటర్ టైటిల్ సాధించాడు.
కాగా ఆ ఒలంపియాడ్లో మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించిన మొదటి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. దీంతో అతను గణిత మేథావి శకుంతలా దేవి రికార్డును బద్దలు కొట్టాడు. ఈ వరల్డ్ రికార్డుతో కలిపి అతని పేరిట మొత్తం 4 రికార్డులు ఉన్నాయి. మరో 50 లిమ్కా రికార్డులను కూడా అతను గణితంలో చూపిన ప్రతిభకు సాధించాడు.
ఇక ఈ ఘనత సాధించినందుకు అతను మీడియాతో మాట్లాడుతూ… చాలా మంది విద్యార్థులకు గణితం అంటే భయం ఉంటుందని కానీ దాన్ని పోగొట్టేందుకు విద్యార్థుల కోసం ఓ అకాడమీ పెట్టాలని ఉందని తెలిపాడు. గణితం అంటే భయపడాల్సిన పనిలేదని, నేర్చుకుంటే దానంత సులభతరమైన సబ్జెక్టు ఏదీ లేదని చెప్పాడు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?