అంతక ముందు వరసగా ఫ్లాప్స్ తో ఇబ్బంది పడ్డ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ వరసగా రెండు సూపర్ హిట్స్ అందుకున్నాడు. మొదటి సినిమా నుంచి తనకంటూ ఒక శైలిని ఏర్పరచుకొని తనకి పర్ఫెక్ట్ గా సూటయ్యే కథలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు ఈ మెగా హీరో. బాక్సాఫీస్ వద్ద మినిమమ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు, అందుకే నిర్మాతలు సాయి ధరమ్ తేజ్ తో సినిమాలు చేయడానికి వస్తున్నారు.
ఇక “చిత్రలహరి”, “ప్రతీరోజూ పండగే” సినిమాలతో సక్సస్ ట్రాక్ ఎక్కిన సాయి ధరమ్ తేజ్ ఇపుడు చేస్తున్న “సోలో బ్రతుకే సో బెటర్” తో మరో హిట్ అందుకొని హ్యాట్రిక్ సాధించాలని కసిగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నో పెళ్ళి సాంగ్ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జంటగా నటిస్తోంది.
అయితే ఈ సినిమా ఇంకా లైన్ లో ఉండగానే సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక మైథలాజికల్ థ్రిల్లర్ ను తన 15వ సినిమాగా అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే. జస్ట్ ప్రీ లుక్ పోస్టర్ తోనే ఈ ప్రాజెక్ట్ మీద మంచి హైప్ తీసుకు వచ్చారు మేకర్స్. కాగా తాజాగా సాయి తేజ్ చేయనున్న 14వ సినిమాకి సంబంధించి అఫీషియల్ న్యూస్ వచ్చింది.
ప్రస్థానం తో తెలుగులో, హిందీలో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న దేవకట్ట దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమాకి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యిపోయిందని.. అక్టోబర్ మూడవ వారం నుంచి షూటింగ్ మొదలు కానుందని కన్ఫర్మ్ చేసేసారు. కాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్.. ఇతర టెక్నికల్ టీమ్ వివరాలు త్వరలో వెల్లడిస్తారని అంటున్నారు. మొత్తానికి సాయి ధరమ్ తేజ్ దూకుడు మీదున్నాడు.