ప్రస్తుతం సంపత్ నంది యాక్షన్ హీరో గోపీచంద్ తో సీటీమార్ అన్న సినిమాని తెరకెక్కిస్తున్నాడు. తమన్న భాటియా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ ఇద్దరు కబడ్డీ కోచ్ లు గా నటిస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తూనే మరో వైపు సినిమాలని నిర్మిస్తున్నాడు. గాలిపటం, పేపర్ బాయ్ లాంటి సినిమాలని కథ అందిస్తూ నిర్మిస్తున్నాడు. తన అసోసియోట్స్ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే తాజాగా సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో ఒక సినిమా రూపొందుతుంది. ‘బ్లాక్ రోజ్’ అన్న టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఊర్వసి రౌతల నటిస్తుండగా రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయింది. ఈ సందర్భంగా సంపత్ నంది ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను అధికారకంగా వెల్లడించాడు.
మోహన్ భరద్వాజ్ ‘బ్లాక్ రోజ్’ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక హీరోయిన్ ఊర్వసి రౌతల సంపత్ నంది అందించిన స్క్రిప్ట్ చాలా ఇంప్రెసివ్ గా ఉందని తెలిపింది. సింగిల్ షెడ్యూల్ లోనే సినిమాను పూర్తి చేసి ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా హీరోయిన్ తో పాటు ఇతర యూనిట్ సభ్యులందరికి కరోనా పరీక్షలు జరిపిన తర్వాతే చిత్రీకరణ మొదలు పెట్టారట.
ఇక సంపత్ నంది మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో రచ్చ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎన్నో సార్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఇద్దరి మద్య కథా చర్చలు జరిగాయని ..త్వరలో సంపత్ నంది, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా మొదలవబోతుందని వార్తలు వచ్చాయి. రీసెంట్ గా పవన్ తో సినిమా చేయాలనుకుంటున్న దర్శకుల జాబితాలో సంపత్ నంది పేరు కూడా ప్రస్తావనకి వచ్చింది. కాని ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఇప్పట్లో జరగని పని అని అర్థమవుతోంది. ఏదేమైనా సంపత్ నంది ఒకవైపు దర్శకుడిగా..మరో వైపు నిర్మాతగా కొనసాగుతుండటం గొప్ప విషయం.