వైసీపీలో నువ్వా-నేనా అనే రాజకీయాలు తెరమీదికి వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి చాపకింద రాజకీయం నేపథ్యంలో వైసిపి శాసనసభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా అంతే రేంజ్లో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. దీంతో దర్శి వైసిపి రాజకీయాలు వేడెక్కాయని అంటున్నారు పరిశీలకులు.
ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ తరఫున కాపు వర్గానికి చెందిన మద్దిశెట్టి వేణుగోపాల్.. విజయం సాధించారు. అయితే, ఇదే నియోజకవర్గంలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తన వర్గాన్ని కలుపుకొని రాజకీయాలు చేస్తున్నారు.
విషయంలోకి వెళ్తే.. 2004లో బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి దర్శిలో ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత ఆయనను వైఎస్ కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. దీంతో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి నియోజకవర్గంపై బూచేపల్లి వర్గం పట్టు పెంచుకుంది. ఈ క్రమంలోనే 2009లో బూచేపల్లి కుమారుడు శివప్రసాద్రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం జరిగిన రాజకీయ పెనుమార్పులు, వైసీపీ ఆవిర్భావంతో ఈయన జగన్కు జై కొట్టారు. ఈ క్రమంలోనే 2014లో వైసీపీ తరఫున ఇక్కడ నుంచి శివప్రసాద్రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు..ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున శిద్దా రాఘవరావు.. విజయం సాధించి మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఇక, ఈ నియోజకవర్గంలో వైసీపీ ఇంచార్జ్గా ఉన్న శివప్రసాదరావు.. వైసీపీ తదుపరి ఎన్నికల్లో అంటే.. 2019లో అయినా అధికారంలోకి వస్తుందో రాదో.. అనే సందేహంతో ఇంచార్జ్ పదవిని వదులుకున్నారు. దీంతో బాదం మాధవరెడ్డికి ఇంచార్జ్గా ఛాన్స్ ఇచ్చారు. అయితే, ఆయనా నాలుగు నెలలకే ఇన్చార్జ్ పదవి నుంచి తప్పుకొన్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది ఎన్నికలకు నాలుగు నెలల ముందు వేణుగోపాల్కు ఛాన్స్ ఇచ్చారు.వెనువెంటనే జరిగిన ఎన్నికల్లో వేణుగోపాల్ దర్శిలో గెలుపొందారు.అయితే ఈ గెలుపులో బూచేపల్లి కూడా కీలక పాత్ర పోషించారన్నది వాస్తవం.
ఇక, అక్కడి నుంచి శివప్రసాద్రెడ్డి అరె.. నేనే పోటీ చేసి ఉంటే బాగుండేది కదా ? అనుకుంటూ.. ఆధిపత్య రాజకీయాలకు తెరదీశారు. నియోజకవర్గంలో రెడ్డి వర్గం డామినేషన్ ఎక్కువగా ఉండడంతో ఈ వర్గాన్ని మొత్తాన్ని.. శివప్రసాద్ రెడ్డి చేతుల్లో పెట్టుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. పోలీసుల బదిలీలతో పాటు ఇతర అధికారుల బదిలీలలో కూడా ఇద్దరి మధ్య తీవ్రమైన వైరుధ్యం ఏర్పడింది. ఇక ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి శివప్రసాద్ రెడ్డి తల్లి వెంకాయమ్మకు ఇస్తారన్న ప్రచారం నేపథ్యంలో . వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గంలో తాను స్ట్రాంగ్ అవ్వాలని శివప్రసాద్ రెడ్డి పట్టుకోసం ప్రయత్నాలు చేస్తుంటే.. వేణుగోపాల్ మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వకుండా మందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే, శివప్రసాద్ రెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి.నిజానికి 2009లో మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రజారాజ్యం అభ్యర్థిగా దర్శిలో పోటీ చేయగా ఆయన్ను బూచేపల్లి ఓడించారు.ఇప్పుడు అదే వేణుగోపాల్ కింద తాను మాజీగా ఉండటం అన్న దాన్ని బూచేపల్లి భరించలేకపోతున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి .వారి మధ్య విభేధాలు ఎంతవరకు వెళతాయో వేచి చూడాలి.