చివరి దశ ప్రయోగాలలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ కి సంబందించిన కోవిషీల్డ్ టీకా చుట్టూ కొన్ని వివాదాలు చుట్టుకున్న విషయం మన అందరికి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని, టీకా కి సంబంధించి చివరి దశ ట్రయిల్ స్ కొనసాగుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. టీకా ట్రయిల్ స్ లో పాల్గొన్న వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ అఫ్ ఇండియా(డీసీజీఐ), ఇన్స్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ (ఐఈసీ) అధికారులు ఈ టీకా మీద పూర్తి స్థాయిలో సమీక్షించిన అనంతరం కేంద్రం ఈ ప్రకటన చేసింది.
భారత్ దేశంలో, ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తోన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తోంది సీరమ్ ఇన్స్టిట్యూట్. ఈ టీకా క్లినికల్ ట్రయల్స్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రాష్ట్రాల్లో వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్ను ప్రయోగిస్తున్నారు. ఈ ప్రక్రియ లో భాగంగా టీకా ట్రైల్స్ లో పాల్గొన్నా వాలంటీర్ ఒకరు తనకు మందు తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా దుష్ప్రభావాలు కలిగాయని, తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తాయని,నాడి వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిందని ఫిర్యాదు చేస్తూ, 5 కోట్లు నష్టపరిహారం చెలించాల్సిందిగా దావా వేసిన సంగతి తెలిసిందే.
ఈ ఆరోపణలపై సీరం ఇన్స్టిట్యూట్ స్పందించింది. సదరు వాలంటీర్ చేసిన ఆరోపణలను సీరమ్ ఇన్స్టిట్యూట్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. అతను చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని నిర్ధారించింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావనే నిర్ధారించుకున్న తరువాతే క్లినికల్ ట్రయల్స్ చేపట్టామని వెల్లడించింది. తప్పుడు ఆరోపణలను చేసిన వాలంటీర్పై సీరం సంస్థ కూడా తిరిగి 100 కోట్ల పరువునష్టం దావా వేసింది. అయితే ఈ విషయాల మీద డీసీజీఐ అధికారులు పూర్తి స్థాయిలో సమీక్షించిన అనంతరం, కేంద్ర ప్రభుత్వం ఈ టీకా చివరి దశ ట్రైల్స్ నిర్వహించడానికి ఆమోదం తెల్పింది. వాలంటీర్ ఆరోగ్య సమస్యలని పూర్తేగా విశ్లేషించిన అనంతరం ప్రయోగాలు ఆపివేసేందుకు ఎలాంటి కారణాలు కనపడలేదు అని అధికారులు చెప్పారు.
ఈ మేరకు సీరం సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. వ్యాక్సిన్ అభివృద్ధిలో తాము అన్ని నియంత్రణ, నైతిక ప్రక్రియలను అనుసరిస్తున్నామని వెల్లడించింది. అన్ని రకాల జాగ్రత్తల తర్వాతే తాము ట్రయల్స్ నిర్వహించామన్నది. వాలంటీర్ అనారోగ్యం గురించి నోటీసులో పేర్కొన్న విషయాలు పూర్తిగా అవాస్తవం.. అసంబద్ధమైనవి. ప్రస్తుతం అతను ఎదుర్కొంటున్న అనారోగ్య పరిస్థితికి, సీరం ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ట్రయల్స్కి ఎలాంటి సంబంధం లేదు. అతను అబద్దం చెప్తున్నాడు.. అతడి అనారోగ్య సమస్యలకు కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్ని బ్లేమ్ చేస్తున్నాడు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు. అబద్ధాలతో సంస్థ ప్రఖ్యాతిని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాడు’ అని ప్రకటనలో పేర్కొంది. అంతేకాక సదరు వాలంటీర్ ఆరోగ్య పరిస్థితిపై సీరం ఇన్స్టిట్యూట్ సానుభూతి వ్యక్తం చేసింది.