రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణానదికి వరద ఉదృతి అధికంగా ఉంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి పెరిగింది. వరద ఉదృతి పెరగడంతో ప్రాజెక్టు అధికారులు తొమ్మిది గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో 3,50,341 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3,14,293 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 888 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 216.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 214.9450 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రాజెక్టు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
అదే విధంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే 20 క్రస్ట్ గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 3,14,293 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 3,37,961 క్యూసెక్కులు కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.30 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.040 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 309.9534 టీఎంసీలుగా కొనసాగుతోంది. మరో పక్క బుధవారం సాగర్ ఎడమ కాలువకు గండిపడింది. దీంతో నిడుమనూరు, నర్శింహులగూడెం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాల్లో ఏడు అడుగల ఎత్తులో నీరు చేరడంతో ప్రజలు భయాందోళనకు గురై నివాసాలను వదిలి వీధుల్లోకి పరుగురు తీశారు. గ్రామాల్లోకి నీరు నీరు చేరడంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
ఇక పులిచింతల నుండి ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం పెరుగుతోంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రకాశం బ్యారెజ్ వద్ద రాత్రిలోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారెజ్ కి ఇన్ ఫ్లో 1,25,626 క్యూసెక్కుల వస్తుండగా అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణానదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. వినాయక నిమజ్జన వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపి విపత్తుల సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచించారు. ప్రజలు వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని ఆయన తెలిపారు.