అనంతపురం: అనంతపురం జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. విడపనకల్లు మండలం డోనేకల్లు వద్ద 63వ నెంబరు జాతీయ రహదారిపై వంక ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో బళ్లారి – గుంతకల్లు మద్య రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల పరిధిలోని వేరుశనగ, వరి పంటలు నీట మునిగాయి. గుత్తిలో కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పట్టణంలో డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని విడనకల్లు, బెల్లుగుప్ప, వజ్రకరూరు మండలాలలో భారీ వర్షం కురిసింది. 15 ఏళ్లుగా నీరు పారని ఉప్పు, పెద్ద వంకలు వర్షపునీటితో పొంగిపొర్లుతున్నాయి. కొండ ప్రాంతం నుండి కొండ చిలువలు కొట్టుకురావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తాడిపత్రి, గుంతకల్లు, మడకశిర, ఉరవకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో కుండపోత వర్షం కురిసింది. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపల్లిలో ఇంటి పిడ్డగోడ కూలి వైష్ణవి అనే బాలిక మృతి చెందింది. తాడిపత్రిలోని పిన్నెపల్లి చెరువుకు గండి పడి యాడికి మండల కేంద్రంలోకి వరద నీరు ప్రవేశించింది. పలు బైక్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. వేములపాడు వద్ద వరద నీటిలో వంద గొర్రెలు, 50 పశువులు కొట్టుకుపోయాయి.
మరో పక్క భారీ వర్షాల కారణంగా పలు గ్రామాల్లో చెరువులు నిండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.