హిందువులకు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఎంతో ముఖ్యమైనది. ఈ దీపావళికి నోరూరించే పిండివంటలు, దీపాలంకరణ, టపాకాయల మోత, ప్రత్యేకమైన పూజలు ఇలా ఎంతో హడావిడిగా కుల, మత భేదాలు లేకుండా ఈ పండుగను విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. ప్రతిసంవత్సరం ఆశ్వీయుజ మాసం బహుళ అమావాస్య రోజున చీకటిని పారద్రోలి వెలుగులు విరజిమ్మే ఈ పండుగను వేడుకగా జరుపుకుంటారు.
ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజుని నరక చతుర్దశి అని కూడా అంటారు. నరక చతుర్దశి రోజున తెల్లవారుజామున మంగళ స్నానాలు చేసి హారతులు తీసుకుని నరకాసురుని బొమ్మను దహనం చేస్తూ, నరక చతుర్దశిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దీపావళిని పురస్కరించుకుని ప్రతి ఇంట్లో లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి, వివిధ రకాల వంటలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పండుగకు మిఠాయిలు ప్రాముఖ్యత, కనుక వివిధ రకాల పిండి వంటలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యం గా సమర్పిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక విధమైన మిఠాయిలు తయారుచేసుకొని ఈ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు.
సాధారణంగా దీపావళి పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా తీపి చక్రాలు, రవ్వ లడ్డు, గులాబ్ జామున్, మైసూర్ పాకు,లడ్డు వంటి వివిధ రకాల తీపి పదార్థాలతోపాటు గారెలు, మురుకులు, పులిహోర వంటి పిండివంటకాలతో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు.
దీపావళి పండుగను భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల కన్నా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఐదు రోజులపాటు జరుపుకునే ఈ దీపావళి పండుగను లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలను నిర్వహించి, భక్తిశ్రద్ధలతో విజయానికి ప్రతీకగాఎంతో ఆనందంగా బాణసంచా కాలుస్తూ ఈ పండుగను జరుపుకుంటారు.అలాగే ఇంటికి వచ్చిన అతిథులకు మిఠాయిలు పంచి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.