ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజకు సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే నిర్వాహకులు ఆ కార్యక్రమానికి సంబంధించిన దాదాపు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆ రోజున ప్రధాని మోదీ అయోధ్యకు వచ్చి వెండి ఇటుక ద్వారా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం రూ.500 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను మోదీ ప్రారంభిస్తారు.
అయితే అయోధ్య రామమందిర నిర్మాణానికి ఇప్పటికే అనేక మంది నేతలు, సెలబ్రిటీలు విరాళాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఆలయ నిర్మాణానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎవరైనా తమకు తోచినంత విరాళం అందజేయవచ్చు. అందుకుగాను https://srjbtkshetra.org/donation-options/ అనే వెబ్సైట్ను ఏర్పాటు చేశారు. అందులో దాతలు తమ విరాళాలను అందజేయవచ్చు. విరాళాలను ఏ రూపంలో అయినా ఇవ్వవచ్చని నిర్మాణకర్తలు తెలిపారు.
అయోధ్య రామమందిర నిర్మాణ పనులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చూసుకుంటోంది. దానికి సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కె.పరాశరన్ చైర్మన్, ట్రస్టీగా ఉన్నారు. దాతలు ఆలయ నిర్మాణానికి గాను డబ్బులే కాక స్థిరాస్తులను కూడా విరాళంగా ఇవ్వవచ్చు. ఇక ఆలయ నిర్మాణంలో ఉపయోగించే పవిత్ర నదుల నీళ్లు, రాముడు తిరిగిన చోట్ల ఉన్న మట్టిని ఇప్పటికే సేకరించి అయోధ్యకు చేర్చారు. ఆలయాన్ని మొత్తం 161 అడుగుల ఎత్తులో నిర్మిస్తారు. పూర్తి నగర నిర్మాణ శైలిలో, శిఖరం, 5 డోములతో ఆలయాన్ని 3 ఏళ్లలో నిర్మించనున్నారు.