వెండితెరపై తన మాస్, క్లాస్ యాక్షన్ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు హీరో సూర్య. తన సినిమాలతోనే కాదు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోంటూ ఎనలేని పేరును సంపాదించుకున్నారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడమే లక్ష్యంగా అగరం అనే స్వచ్ఛంద సంస్థను ఆయన స్థాపించారు. ఎంతో మంది విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు సూర్య. పేద విద్యార్థులకు విద్యను అందించడమే కాకుండా అగరం సంస్థ ద్వారా అనేక ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇప్పుడు సూర్య గురించి ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలైన కారణం. ఇటీవల కోలీవుడ్లో అనేక మంది నటులు రాజకీయ రంగ ప్రవేశం గురించి సమాలోచనలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తమ అభిమాన హీరో సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ తమదైన ముద్రవేసి.. ప్రజలకు అండగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదివరకూ తమిళ అగ్ర నటుడు కమల్ హాసన్ మక్కల్ నిది మయ్యమ్ అనే పార్టీని స్థాపించి.. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బీజీ అయ్యారు.
తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ సైతం రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపారు. దీని కోసం ప్రత్యేక పార్టీని కూడా స్థాపించనున్నట్టు తెలిపారు. అయితే, దీనిపై ఇంకా రజినీ క్లారిటీకి రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.. ఆయనపై రాజకీయ ఒత్తిడిని సైతం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా హీరో సూర్య ఫ్యాన్స్ సైతం ఆయనను రాజకీయాల్లోకి రావాలని సూచించడంతో ఆయన దీనికి అనుగుణంగా ఒత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తమిళ టీవీ ఛానెల్స్ హీరో సూర్య రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారంటూ వార్తలు ప్రచారం చేశాయి.
దీంతో హీరో సూర్య పేరు హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలోనే తన పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు సూర్య. రాజకీయల్లోకి ప్రవేశించడం తనకు ఇష్టం లేదంటూ తాజా వార్తలపై నీరు చల్లారు సూర్య. ఇప్పట్లో రాజకీయాలు గురించి ఆలోచించడం లేదనీ, ప్రస్తుతం తన దృష్టి సినిమాలపై నే ఉందని తెలిపారు. తాను స్థాపించిన అగరం స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగించనున్నట్టు తెలిపారు. కాగా, సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా ఈ నెల 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీనిని దెక్కన్ ఎయిర్వేస్ స్థాపకులు గోపీనాథ్ జీవితం అధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ కు మంచి స్పందనరావడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.