విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ఘటన ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. స్వర్ణ ప్యాలెస్ ను కోవిద్ సెంటర్ గా నిర్వహిస్తున్న రమేష్ హాస్పిటల్ యాజమాన్యాన్ని అగ్నిప్రమాదానికి బాధ్యులను చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చూస్తోన్న విషయం తెల్సిందే. ఘటన జరిగిన దగ్గరనుండి డాక్టర్ రమేష్ కుమార్ పరారీలో ఉన్నారు.
అయితే స్వర్ణ ప్యాలస్ ప్రమాద ఘటనకు సంబంధించి డాక్టర్ రమేష్ కుమార్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్వర్ణ ప్యాలస్ హోటల్ లో కోవిడ్ సెంటర్ నిర్వహణకు అధికారులు అనుమతి ఇచ్చారని పిటీషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించగా ఆ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. అనుమతులు మంజూరు చేసిన అధికారులు కూడా ప్రమాదానికి బాధ్యులే కదా అని వ్యాఖ్యానించింది. డాక్టర్ రమేష్ కుమార్ తో పాటు రమేష్ హాస్పిటల్ చైర్మన్ పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు.